మురుగు..కనుమరుగు
ABN , Publish Date - May 10 , 2025 | 12:43 AM
జగిత్యాల మున్సిపాలిటీ కొత్త రూపు సంతరించుకోనుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ల సూచనలతో జగిత్యాలలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి యూఐడీఎఫ్ ద్వారా రూ.400 కోట్లు నిధులతో డీపీఆర్ను సిద్ధం చేశారు.

-జగిత్యాలలో రూ.400 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
-రెండు వేలకు పైగా మ్యాన్హోల్స్
-7,233 ఇన్స్పెక్షన్ చాంబర్స్ ఏర్పాటు
-కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శికి డీపీఆర్ సమర్పణ
-ఏడాదిన్నరలో పూర్తి చేసేలా కార్యాచరణ
జగిత్యాల, మే 8 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల మున్సిపాలిటీ కొత్త రూపు సంతరించుకోనుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ల సూచనలతో జగిత్యాలలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి యూఐడీఎఫ్ ద్వారా రూ.400 కోట్లు నిధులతో డీపీఆర్ను సిద్ధం చేశారు. ఈ నిధులతో కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించనున్నారు. పైపులైన్ విధానంలో నిర్మించే ఈ ప్రాజెక్టు పూర్తయితే జగిత్యాలలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
ఫ21,700 నివాస గృహాలు..
జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో 21,700 గృహాలు ఉన్నాయి. వీటి ద్వారా వెలువడుతున్న మురుగు నీరు డ్రైనేజీల ద్వారా ముందుకు సాగుతోంది. అయితే అడ్డంకులు, అసంపూర్తి నిర్మాణాలతో నీరు నిలిచి చెత్త, చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుండడమే కాక దోమల వృద్ధికి కారణమవుతోంది. చిన్నపాటి వర్షం వచ్చినా నీరంతా రోడ్లపైకి చేరుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 2 వేలకు పైగా మ్యాన్హోల్స్, 7,233 ఇన్స్పెక్షన్ చాంబర్స్ ఏర్పాటు ఏర్పాటు చేసి 108.5 కిలోమీటర్ల నిడివితో పైపులైన్ నిర్మిస్తారు. ఇళ్లలో నుంచి నీటిని మ్యాన్హోల్స్లోకి అక్కడి నుంచి సబ్ లైన్స్, ఆపై ట్రంక్ మెయిన్ ద్వారా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (మురికినీటి శుద్ధి కేంద్రం)కు పంపుతారు.
ఫనాలుగు జోన్లుగా విభజన..
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో భాగంగా జగిత్యాలను నాలుగు జోన్లుగా విభజించారు. పట్టణాన్ని మొదటి జోన్గా, శివారు ప్రాంతాలను 2, 3, 4 జోన్ల్గా నిర్ధారించారు. ఆయా జోన్లలోని లోతట్టు ప్రాంతాల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) నిర్మించి అక్కడికి మురుగునీటిని మళ్లీస్తారు. అక్కడ నీటిని శుద్ధి చేసి వ్యవసాయ అవసరాలతో పాటు పార్క్, డివైడర్లు, రోడ్ల పక్కన పెంచుతున్న మొక్కలకు వినియోగిస్తారు. ప్రస్తుతం ఇళ్లలో నుంచి వెలువడుతున్న మురుగునీరు చెరువులు, కాలువల్లో కలిసి కలుషితమవుతోంది. యూజీడీ పనులు పూర్తయితే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ పనులను ఒప్పందం ప్రకారం రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఏడాదిన్నరలోనే పూర్తి చేయాలని యోచిస్తున్నారు. పనులు పూర్తయ్యాక పదేళ్లపాటు నిర్మాణ కంపెనీయే నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. మురుగునీరు ముందుకు సాగేలా అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తుండగా వర్షపు నీటిని తరలించేందుకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్ (ఎస్డబ్ల్యూడీ) సిస్టమ్ నిర్మించనున్నారు.
ఫఇవీ ప్రయోజనాలు..
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంతో పట్టణంలో వర్షపు నీరు ప్రణాళిక బద్ధంగా తొలగించడుతుంది. దీనివల్ల రోడ్లు, ఇతర ప్రాంతాలు నీటితో నిండిపోకుండా ఉంటాయి. గాలిలో దుమ్ము, మట్టి తక్కువగా ఉండడం వల్ల ప్రజలు ఆరోగ్యానికి ఇబ్బంది కలగదు. పట్టణంలో గాలి స్వచ్ఛంగా ఉండే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయి. పట్టణంలో ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించే అవకాశాలుంటాయి.
ఫనిధుల మంజూరుకు గ్రీన్సిగ్నల్..
జగిత్యాల పట్టణ సమగ్రాభివృద్ధికి రూ.400 కోట్లు మంజూరు చేయడానికి కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. నెల రోజుల క్రితం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ న్యూఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్లతో కలిసి కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ను కలిసి నిధుల మంజూరుకు విన్నవించారు. జగిత్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, మురుగు నీటి శుద్ధి ప్లాంటు అవసరాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. రూ.400 కోట్ల అంచనాతో డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు రూపొందించి అందించారు. యూఐడీఎఫ్ పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీ సీనరేజ్ ప్లాంట్కు నిధులు మంజూరు చేయాలని కోరారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవ చూపడం, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ ప్రయత్నాలతో కేంద్రం నిధుల మంజూరుకు హామీ ఇచ్చింది. నిధుల మంజూరు పూర్తయితే పట్టణంలో యూజీడీకి సంపూర్ణంగా లైన్క్లియర్ అయినట్లవుతుంది. ఇందుకు అనుగుణంగా కేంద్రం సంకేతాలు ఇవ్వడంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై ప్రజల్లో ఆశలు పెరుగుతున్నాయి.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కృషి
-మాకునూరి సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జగిత్యాల మున్సిపల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన కృషి చేస్తున్నా. ఇప్పటికే డిటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించాం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. కేంద్రం నుంచి సహకారం అందేలా ఎంపీ అరవింద్ కృషి చేస్తున్నారు. సాధ్యమైనంత తొందరలో యూజీడీ నిధులు మంజూరుతో పాటు నిర్మాణం జరిగేలా కృషి చేస్తున్నా.