భక్తజన సంద్రంగా రాజన్న ఆలయం
ABN , Publish Date - Jun 02 , 2025 | 12:58 AM
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్త జనసంద్రంగా మారింది.
వేములవాడ కల్చరల్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్త జనసంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు రాజన్న ఆలయ ధర్మగుండంలో పవిత్ర స్నానాలను ఆచరించి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ధర్మ దర్శనం, కోడె మొక్కు క్యూలైలో భక్తులు సుమారు నాలుగు గంటలకు ఆలయంలోకి చేరుకొని శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్నకు ఇష్టమైన కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనుబంధాలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని 70 వేల మంది వరకు భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈవో వినోద్రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.