ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - May 25 , 2025 | 12:16 AM
రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, ఈ సాగులో ఆయిల్ పామ్కు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
కరీంనగర్ అర్బన్, మే 24(ఆంధ్రజ్యోతి): రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, ఈ సాగులో ఆయిల్ పామ్కు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. లోహియా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై ‘బంగారు రైతు’ అవగాహన కార్యక్రమాన్ని కరీంనగర్లోని కేఎస్ఎల్ గార్డెన్లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడారు. కేవలం వరి మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై కూడా రైతులు దృష్టి సారించాలని అన్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండి ఉత్పత్తి తక్కువగా ఉండే పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఒక సీజన్లో వరి వేస్తే మరో సీజన్లో ప్రత్యామ్నాయ పంట వేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలలో ఆయిల్ పాం సాగు ప్రయోజనకరమైనదని తెలిపారు. ఈ పంటలో అంతర పంట కూడా సాగు చేయవచ్చని అన్నారు. మూడు సంవత్సరాల పాటు కష్టపడితే 30 సంవత్సరాల నికర ఆదాయం ఈ పంట ద్వారా చేకూరుతుందని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం నాలుగు సంవత్సరాలకు ఎకరానికి 51 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ఎకరానికి 22,500 రూపాయల సబ్సిడీ బిందు సేద్యం కోసం అందిస్తుందని వివరించారు. జిల్లాలో కేవలం 320 మంది రైతులు మాత్రమే 1,200 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని అన్నారు. ఈ సాగు విస్తీర్ణాన్ని ఈ ఏడాది 3 వేల ఎకరాల వరకు విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆయిల్ పామ్ ద్వారా రైతులు లాభాలను ఆర్జించవచ్చని అన్నారు. లోహియా కంపెనీ సీఈఓ సిద్ధాంత్ లోహియా మాట్లాడుతూ జిల్లాలో విలేజ్ అవుట్ రీచ్ కార్యక్రమం ద్వారా ప్రతి రైతును కలిసి బంగారు రైతుగా మార్చేందుకు లోహియా గ్రూపు చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఆయిల్పామ్ పంటసాగు చేసే రైతులకు గోల్డ్ స్కీమ్, బంపర్ లక్కీడ్రా గురించి రైతులకు వివరించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంతరావుపేటలో సెప్టెంబరు 4వ తేదీన ఫ్యాక్టరీ శంఖుస్థాపన చేయనున్నట్లు సీఈఓ తెలిపారు. జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగు ద్వారా ఏడాదికి 4 నుంచి 6 లక్షల ఆదాయం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, లోహియా సంస్థ సీఈవో సిద్ధాంత్ లోహియా, ప్రతీక్ పట్నాయక్, కరీంనగర్ ఇన్చార్జి భరత్ తదితరులు పాల్గొన్నారు.