వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:19 AM
వర్షాకాలంలో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ అన్నారు. కొత్తపల్లి ఆరోగ్య కేంద్రాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు.
భగత్నగర్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ అన్నారు. కొత్తపల్లి ఆరోగ్య కేంద్రాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. కొత్తపల్లిలో జరుగుతున్న ఆశ డే కార్యక్రమానికి హాజరై సీవైటీబీ టెస్టులను (మైకో బ్యాక్టీరియం టుబర్కులోసిస్ యాంటిజెన్ ఆధారిత చర్మ పరీక్షలను) ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సబ్ సెంటర్ల వారీగా ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని హాజరు పట్టిక, ఇతర రికార్డులను తనిఖీ చేశారు. పరిశుభ్రత, లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. అభా కార్డుల రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయాలన్నారు. అధిక రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం సరఫరా చేసే మందులను అందించాలన్నారు. అంతకు ముందు ఆసిఫ్నగర్ హెల్త్ వెల్నెస్ సెంటర్ను సందర్శించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ వనజ, శ్రావిక, వైద్య సిబ్బంది, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.