పల్లెల్లో వేడెక్కుతున్న రాజకీయం
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:06 AM
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీంతో ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని తేలిపోయింది.
జగిత్యాల, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీంతో ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని తేలిపోయింది. అధికారులు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తాజాగా గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశాలు నిర్వహించారు. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఎన్నికలే ముందు నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబరు 30లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో ఈసీ సైతం ఆ దిశగా దృష్టి సారించింది.
ఫయేడాదికి పైగా ప్రత్యేక పాలనే..
గ్రామ పంచాయతీ ఎన్నికలు 2019లో జరగగా గత యేడాది ఫిబ్రవరి 2వ తేదీన పాలక వర్గాల గడువు ముగిసింది. ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అదే ఏడాది మే నెలలో నిర్వహిస్తే 2024 జూన్ మాసంతో పాలకవర్గాల గడువు తీరింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీల్లో, మండల పరిషత్, జిల్లా పరిషత్లలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. కానీ ప్రత్యేకాధికారులు కొన్ని ప్రాంతాల్లో పట్టించుకోకపోవడంతో పాలన కుంటు పడుతోంది. నిధులు సైతం అంతంత మాత్రంగానే వస్తుండడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఫఅదిగో...ఇదిగో అంటూ
ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయంటూ హడావుడి చేయడం, ఆపై మరుగున పడడం సాధారణమైంది. ఐదారు నెలలుగా నేడో, రేపో నోటిఫికేషన్ వస్తుందని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ నేతలు కూడా సంకేతాలు ఇచ్చారు. మాజీ ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గాల వారీగా సమావేశాలు సైతం పూర్తి చేశారు. అయితే కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది తేలకపోవడంతో ఆశావహులు కూడా స్తబ్దంగా ఉండిపోయారు.
ఫకోర్టు తీర్పుతో మళ్లీ..
ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. సెప్టెంబరు 30 కల్లా స్థానిక సంస్థల్లో పాలకవర్గాలు కొలువుదీరాలని తీర్పు వెలువడింది. జిల్లాలోని 385 పంచాయతీలు, 3,536 వార్డులు అంతేస్థాయిలో పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 205 ఎంపీటీసీ, 20 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఇందుకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలింగ్ రెండు విడతల్లో నిర్వహించడానికి నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఎంపిక చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
ఫఎన్నికల సంఘం వైపు చూపు..
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వ నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చింది. మంత్రి మండలి లేఖ ఆధారంగా ఎన్నికల సంఘం ఏ ఎన్నికలకు, ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని సైతం ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పంచాయతీరాజ్ చట్టం సవరించి ప్రత్యేక జీవో జారీ అయినట్లయితే జిల్లాలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. దీంతో జడ్పీటీసీ, ఎంపీటీసీలు మొదలు కొని సర్పంచ్, వార్డు సభ్యుల వరకు ఎలాంటి రిజర్వేషన్ వస్తుందనే దానిపై రాజకీయ పార్టీలతో పాటు ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఫఆశావహుల హడావుడి
పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి దాదాపు ఏడాదిన్నర, జడ్పీ, మండల పరిషత్ పాలకవర్గాలు గడువు ముగిసి ఏడాది దాటింది. పల్లెల్లో రానున్న ఎన్నికలపై రాజకీయ పార్టీతో పాటు ఆశావహులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు వారి నిరీక్షణకు తెరదించేలా ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటి వరకు పట్టించుకోని పలువురు ఓటర్లను సైతం ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. యువతకు విందులు ఏర్పాటు చేస్తున్నారు. తమను గెలిపిస్తే గ్రామానికి అవసరమైన పనులన్నీ చేసి పెడుతామనే నమ్మకం కల్పించేలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీంతో పల్లెల్లో రాజకీయ హడావుడి పెరిగింది.
------------------------------------------------------------------
జిల్లాలో స్థానిక సంస్థల వివరాలు...
------------------------------------------------------------------
జడ్పీటీసీ స్థానాలు...20
ఎంపీటీసీ స్థానాలు...216
ఎంపీపీ స్థానాలు..20
సర్పంచ్ స్థానాలు..385
వార్డులు..3,586
పంచాయతీ ముసాయిదా ఓటర్లు...6,07,222
పురుషులు.. 2,89,249
మహిళలు...3,17,964
ఇతరులు..9