పోలీసులు నూతన సాంకేతికతలో పట్టు సాధించాలి
ABN , Publish Date - Jul 19 , 2025 | 12:21 AM
పోలీసులు నూతన సాంకేతికతపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశించారు. నగరంలోని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ను శుక్రవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తనిఖీ చేశారు.
కరీంనగర్ క్రైం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): పోలీసులు నూతన సాంకేతికతపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశించారు. నగరంలోని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ను శుక్రవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్ పరిసరాలను, సిబ్బందికి అందించిన కిట్లను తనిఖీ చేసి వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల సాఫ్ట్వేర్ అప్లికేషన్లపై పూర్తిస్థాయిలో పట్టుసాధించి రోజువారి విధుల్లో వినియోగించాలని ఆదేశించారు. నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లు పోలీస్స్టేషన్లో అన్ని రకాల విధులను నేర్చుకోవాలని సూచించారు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, కొత్తపల్లి ఎస్ఐ సాంబమూర్తి, రూరల్ ఎస్ఐలు లక్ష్మారెడ్డి, తాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.