భూభారతి చట్టంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - May 07 , 2025 | 11:20 PM
భూసమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భూభారతి(ఆర్వోఆర్) చట్టం తీసుక వచ్చిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్టులో భాగంగా సైదాపూర్ మండంలోని ఎక్లాస్పూర్, రాయికల్ గ్రామాలలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి పరిశీలించారు.
సైదాపూర్, మే 7(ఆంధ్రజ్యోతి): భూసమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భూభారతి(ఆర్వోఆర్) చట్టం తీసుక వచ్చిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్టులో భాగంగా సైదాపూర్ మండంలోని ఎక్లాస్పూర్, రాయికల్ గ్రామాలలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. రైతుల వద్ద నుంచి అర్జీలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ రైతుల భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టం తీసుక వచ్చిందన్నారు. ఈ భూభారతి చట్టం ద్వారా భూసమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకొని, తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. జూన్ 2 నుంచి భూభారతి చట్టం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ముందుగా కరీంనగర్ జిల్లాలో సైదాపూర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిందన్నారు. ఇప్పటికే అన్ని మండలాలలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సమస్యలను అధికారులు నిర్ణీత గడువులోపల పరిష్కరిస్తారన్నారు. రెవెన్యూ సదస్సులో ఆర్జీలు పమర్ఫించే అవకాశం లేని వారు తరువాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్, తహసీల్దార్లు కనకయ్య, శ్రీనివాస్, సింగిల్విండో చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలి
- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, మే 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పరిధిలోని కరీంనగర్ శిశుగృహలో పెరుగుతున్న 5 నెలల ఆడ శిశువును హైదరాబాద్కు చెందిన పిల్లలు లేని దంపతు లకు బుధవారం జిల్లా కలెక్టర్ దత్తత ఇచ్చారు. అలాగే చైల్డ్కేర్ ఇనిస్టిట్యూట్లో పెరుగుతున్న 13 సంవత్సరాల బాబును కరీంనగర్కు చెందిన పిల్లలు లేని దంపతులకు దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్త సంబంధీకుల నుంచి కూడా చట్టబద్ధమైన దత్తత తప్పనిసరి అని అన్నారు. ఇందుకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం భగత్నగర్లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సీడబ్ల్యుసి చైర్పర్సన్ ధనలక్ష్మి, డీసీపీవో పర్వీన్, పీవో తిరుపతి, శిశు గృహ మేనేజర్ తేజస్విని, సీసీఐ నిర్వాహకురాలు సిరిల్, సోషల్ వర్కర్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.