పెన్షన్ భిక్ష కాదు...ఉద్యోగుల హక్కు
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:31 AM
పెన్షన్ భిక్ష కాదని, అది ఉద్యోగుల హక్కు అని టీజేఏసీ జిల్లా చైర్మెన్ దారం శ్రీనివాస్రెడ్డి అన్నారు.
సుభాష్నగర్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పెన్షన్ భిక్ష కాదని, అది ఉద్యోగుల హక్కు అని టీజేఏసీ జిల్లా చైర్మెన్ దారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు, నల్ల దుస్తులు ధరించి సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు 30 నుంచి 35 సంవత్సరాలు ప్రజలకు సేవలందించి పదవీ విరమణ చేస్తారని తెలిపారు. వారికి వృద్ధాప్యంలో ఇచ్చే పెన్షన్ అనేది ఆర్థిక సహాయం కాదని, ఒక సాంఘిక భద్రత చర్య అని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందన్నారు. ఆ తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రజల కోసం అహర్నిశలు పాటుడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. కరోనా లాంటి విపత్కరాల కాలంలో ప్రజలకు సేవలందించింది కాపాడిందే ఉద్యోగులేనని, అలాంటి ఉద్యోగులను కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వ ఉద్యోగుల జీవితం బజారున పడడమే కాకుండా, దాచుకున్న డబ్బుల కోసం, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్, పదవీ విరమణ పొందిన తరువాత పెన్షన్ బిల్లుల కోసం, హెల్త్కార్డుల కోసం, పీఆర్సీ కోసం ఉద్యోగుల ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏ ఉద్యమానికైనా తాము సిద్దంగా ఉన్నామన్నారు. అవినీతికి పాల్పడిన వారిని తప్పకుండా శిక్షించాల్సిందేనని, అలా అని ఉద్యోగులందరిపై చెడు ముద్రవేయడం సరైంది కాదన్నారు. బయోమెట్రిక్, ఫేస్ రికగ్నేషన్ పద్ధతులు అమలు చేస్తూ ఉద్యోగులను అవమాన పరుస్తున్నారన్నారు. ఉద్యోగుల పనిగంటలతో సంబంధం లేకుండా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, విపత్కర పరిస్థితలు, జ్వరాలు, కరోనా సమయంలో, సంక్షేమ పథకాల అమలులో నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. అలాంటి ఉద్యోగులను గడియారాలతో కొలవడం అవమానించడమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి కాళీచరణ్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, టీజీవో కార్యదర్శి అరవింద్రెడ్డి, పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, కార్యదర్శి ఎలదాసరి లింగయ్య, టీచర్ల సంఘం నాయకులు రఘుశంకర్రెడ్డి, రవీంద్రాచారి, కరుణాకర్రెడ్డి, టీఎన్జీవో నాయకులు నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్ర ప్రభాకర్రెడ్డి, సర్దార్ హర్మిందర్సింగ్, ఇరుమల్ల శారద, సబితా, రవీందర్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డి, రాజేశ్భరద్వాజ్, ఉపాధ్యాయుల చంధ్రశేఖర్, గోవిందపతి శ్రీనివాస్, అజ్గరుద్దీన్, రమేశ్, వెలిచాల సుమంత్రావు, కరుణాకర్, లవకుమార్, బైరి శ్రీనివాస్, రాజేశ్వరరావు, కమలాకర్, రాజేందర్, రాజు, కోట రామస్వామి, శంకర్, శ్రీనివాస్, హరిప్రియ, శైలజ, శారద, టీటీయూ నాయకులు ఆదర్శన్రెడ్డి, గంప చంద్రశేఖర్, ఈశ్వరయ్య, రామ్మోహన్, రోహిత్కుమార్ పాల్గొన్నారు.