peddapally : యూరియా టెన్షన్
ABN , Publish Date - May 26 , 2025 | 12:36 AM
కోల్సిటీ, మే 25 (ఆంధ్రజ్యోతి): ఈ వర్షాకాలం సీజన్కు ముందే యూరియా టెన్షన్ మొదలైంది. రాష్ట్రంలో యూరియా సరిపడేంత బఫర్ స్టాక్ (నిల్వలు) లేదు.
వార్షిక మరమ్మతులతో ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి నిలిపివేత
జూన్ రెండోవారంలోనే ఉత్పత్తికి అవకాశం
మే నెలలో కేంద్రం రాష్ర్టానికి కేటాయించింది 50వేల టన్నులే
ఈ ఏడాది సీజన్కు ముందే వర్షాలు
వ్యవసాయశాఖ వద్ద పడిపోయిన బఫర్ స్టాక్
కోల్సిటీ, మే 25 (ఆంధ్రజ్యోతి): ఈ వర్షాకాలం సీజన్కు ముందే యూరియా టెన్షన్ మొదలైంది. రాష్ట్రంలో యూరియా సరిపడేంత బఫర్ స్టాక్ (నిల్వలు) లేదు. దీనికితోడు రాష్ట్ర రైతాంగానికి ప్రధాన యూరియా సరఫరా చేసే రామగుండం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో వార్షిక మరమ్మతుల కారణంగా యూరియా ఉత్పత్తిని నిలిపివేశారు. మే6వ తేది నుంచి ఉత్పత్తి నిలిచిపోయింది. ఏప్రిల్లోనే పరిశ్రమలో వార్షిక మరమ్మతులు చేయాల్సి ఉండగా రైతాంగం నుంచి యూరియా ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని మే నెలలో షడౌన్ చేశారు. ప్లాంట్లో కీలకమైన హెచ్టీఆర్ మరమ్మతు, అమ్మోనియా పైప్లైన్లు, ఇతర యంత్రాల నిర్వహణ చేయాల్సి ఉంది. సాధారణంగా వార్షిక మరమ్మతులకు 30 నుంచి 40 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యంపై మరమ్మతుల విషయంలో ఒత్తిడి పెడుతుంది. దీంతో ప్రధానమైన హెచ్టీఆర్(హీట్ ట్రాన్సఫర్ రీ ఫార్మర్)ను బైపాస్ చేసి మరమ్మతులు చేస్తున్నారు. తద్వారా పరిశ్రమను త్వరగా ఉత్పత్తి దశలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
గత ఏడాది 4.68లక్షల టన్నుల సరఫరా
ఆర్ఎఫ్సీఎల్ పరిశ్రమ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర రైతాంగానికి సకాలంలో యూరియా సరఫరా చేసి ఆదుకుంటుంది. గత ఏడాది 11.94లక్షల టన్నుల ఉత్పిత్తి జరుగగా రాష్ర్టానికే 4.68లక్షల టన్నులు సరఫరా చేశారు. మొత్తం ఉత్పత్తిలో 45శాతం రాష్ర్టానికి ఇచ్చి మిగతా యూరియాను ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు ఇస్తున్నారు. గత ఏడాది రాష్ట్రంలో నీటి లభ్యత కారణంగా సాగు విస్తీర్ణత పెరిగింది. ఒక వర్షాకాలంలోనే కోటి మూప్పైలక్షల ఎకరాలలో సాగు చేసినట్లు లెక్కలు కట్టారు. యాసంగిలో సాగు విస్తీర్ణం తక్కువ అవుతుందని అంచనా వేసి వ్యవసాయ శాఖ యూరియా నిల్వలను తక్కువస్థాయిలో తెచ్చిపెట్టుకుంది. దీంతో యాసంగిలో యూరియా డిమాండ్ అమాంతంగా పెరగడంతో గొడవలు మొదలయ్యాయి. ఆర్ఎఫ్సీఎల్ యుద్ధప్రాతిపదికన ఉత్తర, దక్షిణ తెలంగాణకు యూరియా సరఫరా చేసింది. ఆర్ఎఫ్సీఎల్లోని భాగస్వామ్య సంస్థ అయిన నేషనల్ ఫెర్టిలైజర్స్ (ఎన్ఎఫ్ఎల్) విజయపురి ప్లాంట్ నుంచి 10వేల టన్నులు తెప్పించి సర్దుబాటు చేసింది.
వ్యవసాయశాఖ వద్ద తక్కువ నిల్వలు..
వ్యవసాయశాఖ ఏప్రిల్ నుంచే సాధారణంగా బఫర్ స్టాక్ పెట్టుకుంటుంది. వేసవికాలంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గోడౌన్లలో యూరియా నిల్వలు ఉంచుతారు. ఆర్ఎఫ్సీఎల్ నుంచి ఏప్రిల్ నుంచే యూరియా సరఫరా ఉంటుంది. కానీ ఈసారి రాష్ర్టానికి వర్షాకాలం సీజన్లో కేంద్రం నుంచి కేటాయింపులే తక్కువ స్థాయిలో ఉన్నాయి. వానాకాలం సీజన్లో 12లక్షల టన్నుల డిమాండ్ ఉంటే 9.8లక్షల టన్నులే కేటాయించారు. 2.2లక్షల టన్నుల వ్యత్యాసం ఉంది. దీనికి తోడు మే నెలలో లక్షా 50వేల టన్నులు కేటాయించాల్సి ఉండగా కేవలం 50వేల టన్నులే కేటాయించారు. దీనితో యూరియా నిల్వలు వ్యవసాయ శాఖ వద్ద రెండు లక్షల టన్నుల లోపే ఉన్నాయి. సాధారణంగా వర్షాకాలం సీజన్ ప్రారంభానికి ముందు మూడున్నర లక్షల టన్నులు అందుబాటులో ఉంటేనే యూరియా కొరత లేకుండా ఉంటుంది.
ఉత్పత్తి ప్రారంభమైతేనే..
ఈఏడాది రోహిణి కార్తెకి ముందే వర్షాలు కురవడం, నైరుతి రుతుపవనాలు వస్తుండటంతో సీజన్ ముందస్తుగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శ్రీరాంసాగర్ ఆయకట్టు అయిన ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్తో పాటు వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మొదట సాగు ప్రారంభమవుతుంది. సాధారణంగా ఆర్ఎఫ్సీఎల్ నుంచి రేకుల ద్వారా ఈ జిల్లాలకు మొదట యూరియాను సరఫరా చేస్తారు. తరువాత నాగార్జున్ సాగర్ ఆయకట్టు ప్రాంతాలైన ఉమ్మడి నల్గోండ జిల్లాలకు యూరియా సరఫరా చేస్తారు. జూన్ రెండో వారంలోగా ఆర్ఎఫ్సీఎల్లో యూరియా ఉత్పత్తి జరిగితే ప్రతీరోజు రెండు రేకుల్లో యూరియాను పంపించే అవకాశం ఉంటుంది. ఇతర రాష్ర్టాలకు యూరియా సరఫరాను నిలిపివేసి మొత్తం యూరియాను రాష్ర్టానికి పంపితే జూన్లో 60వేల టన్నుల సరఫరాకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎన్ఎఫ్ఎల్ విజయపురి ప్లాంట్ నుంచి 10వేల టన్నుల యూరయను తెప్పించేందుకు ఆర్ఎఫ్సీఎల్ ప్రణాళికలు చేస్తుంది. ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తయిన యూరియాను జూన్, జూలై నెలల్లో రాష్ర్టానికి ఇవ్వాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వర్షాకాలం సీజన్లో రాష్ర్టానికి యూరియా కేటాయింపులే కేంద్రం కుదించిన పరిస్థితుల్లో ఆర్ఎఫ్సీఎల్ నుంచి యూరియా సరఫరా పెంచుతారా అనేది సందేహం కలుగుతోంది.