Peddapalli: గంజాయి అమ్మినా, కొన్నా కఠిన చర్యలు
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:53 PM
కోల్సిటీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): అసాంఘిక శక్తులపై సమాచారం ఇవ్వాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని గోదావరిఖని ఏసీపీ మడక రమేష్ అన్నారు.
అసాంఘిక శక్తులపై సమాచారం ఇవ్వండి..
గోదావరిఖని ఏసీపీ మడక రమేష్
కోల్సిటీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): అసాంఘిక శక్తులపై సమాచారం ఇవ్వాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని గోదావరిఖని ఏసీపీ మడక రమేష్ అన్నారు. శనివారం గోదావరిఖని రాంనగర్, సీతానగర్, కృష్ణనగర్, లెనిన్నగర్, 2ఏ మోరీ, ఆర్సీఓఏ క్లబ్ ప్రాంతంలో ఏకకాలంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లను సోదాచేయడంతో పాటు సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే కూలీలు ఎక్కువ మంది నివసిస్తున్నారని, వారికి కిరాయి ఇళ్లు ఇచ్చే వారు వారి పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. యువత గంజాయికి బానిసలవుతు న్నారని, గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా గంజాయి విక్రయించినట్టు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మైనర్లకు మోటార్సైకిల్ ఇవ్వకుండా, ట్రాఫిక్ రూల్స్ను పాటించాలని, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేసి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారాన్ని తెలిపితే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కాలనీవాసులకు సూచించారు. ఈ తనిఖీల్లో గోదావరిఖని వన్టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్రావు, ఎస్ఐలు రమేష్, భూమేష్, అనూష, నవీన్, రాజేష్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.