బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు చేసిందేమీ లేదు
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:32 AM
పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు.
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
ధర్మపురి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గంలో సాధించిందేమీ లేదని, తన నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రజలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన అనంతరం ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీల్లో నాలుగు అమలు చేసి ఎంత కష్టమైన మరో రెండు గ్యారెంటీ పథకాలను ఇచ్చి తీరుతామని ఆయన తెలిపారు. ప్రతీ గ్రామంలో పేద వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి వారంవారం లబ్ధిదారులకు డబ్బులు చెల్లిస్తున్నామని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టలేదని ఆరోపించిన కొప్పుల ఈశ్వర్ ఇంటి ప్రారంభోత్సవానికి పిలిస్తే వస్తారా అని ఆయన ప్రశ్నించారు. చెగ్యాం ముంపు బాధితులకు నష్టపరిహారం ఇప్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీరు సిద్దిపేటకు తరలించుక పోతుంటే కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గానికి ఏమి చేశారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. అధికారం కోల్పోయి అక్కసుతో కొప్పుల ఈశ్వర్ ఆరోపణలు మానుకోవాలని ఆయన సూచించారు. యూరియా కొరత దేశమంతా ఉందని ఇందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు యూరియా కొరత గురించి సంబంధిత మంత్రులను కోరలేదని, కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే యూరియా అందించాలని కోరడం జరిగిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్లో చాలా మంది నాయకులు తమతో టచ్లో ఉన్నారని తాము గేట్లు తెరిస్తే మీ పక్కన ఎవరు కూడా మిగలరని ఆయన తెలిపారు. ధర్మపురి పట్టణంలో త్వరలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో ధర్మపురి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్, టీపీసీసీ సభ్యుడు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంగనభట్ల దినేష్, ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చీపిరిశెట్టి రాజేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుంట సుధాకర్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అప్పం తిరుపతి, ధర్మారం ఏఎంసీ చైర్మన్ రాప్లానాయక్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, ఏఎంసీ వైస్చైర్మన్ సంగ నర్సింహులు, ప్రదీప్రెడ్డి, జంగిలి ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.