రైతులకు మరింత సహకారం
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:57 AM
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సాగులో అధిక దిగుబడులు సాధించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
జగిత్యాల, జూలై 31 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సాగులో అధిక దిగుబడులు సాధించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే రైతులకు అనేక సేవలందిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులను సంఘటిత పరిచి మరిన్ని సేవలు అందించేందుకు నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కృషి చేస్తోంది. అందులో భాగంగా 16 పీఏసీఎస్లను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఎంపిక చేసింది. ఎఫ్పీవో(ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)గా గుర్తించిన ఒక్కో పీఏసీఎస్కు ఎన్సీడీపీ నుంచి తొలి విడతగా రూ.3.16 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆయా సంఘాల్లో ప్రత్యేకంగా కార్యాలయ ఏర్పాటుకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన సొసైటీలకు ప్రతి సంవత్సరం కార్యాలయ నిర్వహణ కోసం రూ.6 లక్షలు, వ్యాపార నిర్వహణ కోసం మరో రూ.5 లక్షలు కలిపి మూడేళ్ల కాలంలో రూ.33 లక్షలను ప్రభుత్వం మంజూరు చేయనుంది.
ఫఎఫ్పీవోల ప్రధాన లక్ష్యం..
రైతుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఎఫ్పీవోలు పనిచేయనున్నాయి. ముఖ్యంగా భూసార పరీక్షలు, విత్తన స్వావలంబన, సరైన ఎరువుల ఎంపిక, జల వనరుల సద్వినియోగం, సాంకేతికత వినియోగం, లాభసాటి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించడం, మార్కెట్ సౌలభ్యం, సేంద్రియ సాగు, వినియోదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడం వంటి వాటికి ప్రోత్సాహం అందించనున్నారు. భూమి, నీరు, గాలి కాలుష్య నియంత్రణ, వ్యవసాయ ఆధారిత, వ్యవసాయేతర వ్యాపారాల నిర్వహణ, గ్రామీణ యువత, మహిళలు వ్యవసాయేతర ఉత్పత్తుల వారికి సహాయ పడటం, సంపద సృష్టి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించడం లక్ష్యంగా ప్రభుత్వం ఎఫ్పీవోలను ప్రారంభించింది.
ఫజిల్లాలో 16 ఎఫ్పీవోల గుర్తింపు..
జిల్లాలో 71 పీఏసీఎస్లు ఉన్నాయి. వీటిలో 16 సంఘాలకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్పీవో)గా గుర్తింపు లభించింది. ఇందులో జగిత్యాల, రాయికల్, మల్యాల, కొడిమ్యాల, నంచర్ల, గొల్లపల్లి, వెల్గటూరు, జైన, ధర్మపురి, మల్లాపూర్, మెట్పల్లి, భూషణ్రావుపేట, బీర్పూర్, సారంగపూర్, పైడిమడుగు, ఇబ్రహీంపట్నం సంఘాలున్నాయి. ఇటీవల వీటికి మొదటి విడత నిధులను అందజేశారు. సొసైటీల్లో రైతుల వాటాధనం కింద ఒక్కొక్కరు రూ.2 వేల చొప్పున చెల్లించి 750 మంది రైతులు సభ్యులుగా చేరి రూ.15 లక్షలు జమ చేయాల్సి ఉంటుంది.
ఫరైతులకు ఎంతో ప్రయోజనం...
రైతులు జమ చేసిన వాటా ధనం ఆధారంగా ఎస్సీడీసీ మంజూరు చేసే రుణంతో సంఘం ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాలను నేరుగా రైతులకు విక్రయించాల్సి ఉంటుంది. వివిధ వ్యాపారాల నిర్వహణ ద్వారా సంఘానికి వచ్చిన లాభాన్ని ఏటా సభ్యులకు వాటా ధనం ఆధారంగా చెల్లిస్తారు. త్వరలోనే ఎఫ్పీవోలుగా ఎంపికైన సొసైటీల్లోని సభ్యులకు సంఘం ఏర్పాటు చేయడం, ఎలా అభివృద్ధి చేయాలనే విషయమై శిక్షణ ఇవ్వనున్నారు.
ఫనిధుల వినియోగం ఇలా..
ప్రభుత్వం మంజూరు చేసే నిధులను ఆయా సొసైటీలు నిబంధనల మేరకు వినియోగించాల్సి ఉంటుంది. సీఈవో వేతనం రూ.25 వేలు, అకౌంటెంట్ జీతం రూ.10 వేలకు మించకుండా వ్యయం చేయాలి. కంప్యూటర్, ప్రింటర్, ఇతర సామగ్రి కొనుగోలు కోసం గరిష్ఠంగా రూ.లక్ష వరకు ఖర్చు చేయవచ్చు. కార్యాలయ భవనం అద్దె కింద ఏడాదికి రూ.48 వేలు, విద్యుత్, టెలిఫోన్ చార్జీల కోసం రూ.12 వేలు, ప్రయాణ, సమావేశాల వ్యయం కోసం రూ.18 వేలు, స్టేషనరీ, ఇతర ఖర్చుల కింద రూ.12 వేలకు మించకుండా కేటాయించాలి.
వ్యాపార ప్రణాళికలు..
-సీహెచ్ మనోజ్ కుమార్, జిల్లా సహకార శాఖ అధికారి
ఎఫ్పీవోలుగా ఎంపికైన సొసైటీల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతుల నుంచి వాటా ధనం వసూలు చేసి సభ్యులుగా నమోదు చేస్తున్నాం. మొదటి విడతగా ఒక్కో సంఘానికి వచ్చిన రూ.3.16 లక్షల చొప్పున వచ్చిన నిధులను ఆయా సొసైటీలకు అందజేశాం. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసుకొని ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వ్యాపార ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది.