Share News

వానాకాలం ‘సాగు’ ఖరారు

ABN , Publish Date - May 10 , 2025 | 12:40 AM

యాసంగి ధాన్యం విక్రయించడం.. వరి కోతలపై దృష్టి సారిస్తూనే వానాకాలం సీజన్‌ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. కోతలు పూర్తయిన భూముల్లో దుక్కులు దున్నుకుంటున్నారు. సమృద్థిగా ఈసారి వర్షాలు కురుస్తాయని ఖరీఫ్‌ సాగుపై ఆశలు పెంచుకున్నారు.

వానాకాలం ‘సాగు’ ఖరారు

- జిల్లాలో పంటల యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం

- పంటల రుణపరిమతి పెంపు నామమాత్రమే

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

యాసంగి ధాన్యం విక్రయించడం.. వరి కోతలపై దృష్టి సారిస్తూనే వానాకాలం సీజన్‌ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. కోతలు పూర్తయిన భూముల్లో దుక్కులు దున్నుకుంటున్నారు. సమృద్థిగా ఈసారి వర్షాలు కురుస్తాయని ఖరీఫ్‌ సాగుపై ఆశలు పెంచుకున్నారు. దీనికి అనుగుణంగానే ఖరీఫ్‌కు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ శాఖ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టారు.

ఫ వానాకాలం సాగు 2.43 లక్షల ఎకరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలంలో 2 లక్షల 43 వేల 783 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ఇందులో వరి లక్షా 84వేల 860 ఎకరాలు, పత్తి 49,760 ఎకరాలు, పెసర 79 ఎకరాలు, కందులు 1,155 ఎకరాలు, జొన్నలు 14, మొక్కజొన్న 1,600 ఎకరాలు, ఇతర పంటలు 6,304 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. ఇందుకోసం వరి 56,568 క్వింటాళ్ల విత్తనాలు, అవసరం అవుతాయని అంచనాలు వేయగా కందులు 122.5 క్వింటాళ్లు, మొక్కజొన్న 27.04 క్వింటాళ్లు, పత్తి 1,28,650 ప్యాకెట్లు, పెసర్లు 4.08 క్వింటాళ్లు అవసరం అవుతాయని అంచనాలు వేశారు.

ఫ 56,060 మెట్రిక్‌ టన్నుల ఎరువులు

వానాకాలం 2.43 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానుండగా, ఎరువులు 56,060 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. యూరియా 25,370 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 3,460 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 22,390 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 4,115 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 725 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు.

ఫ 122 పంటలకు స్వల్పంగా రుణ పరిమితి పెంపు

వానాకాలం సీజన్‌ ప్రారంభానికి ముందే పంట రుణాల పరిమితి(స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) ప్రణాళికను ఖరారు చేశారు. రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ నిర్ణయం మేరకు 2025-26 వానాకాలం, యాసంగి సీజన్‌లకు సంబంధించిన 122 పంటలకు సంబంధించి రుణ పరిమితిని పెంచారు. గతేడాదితో పోలిస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగు చేసే ప్రధాన పంటల్లో కొన్ని పంటలకు మాత్రమే స్వల్పంగా పరిమితి పెరిగింది. జిల్లాలో ప్రధానంగా వరి సాగు ఎక్కువగా ఉంటుంది. ఈసారి వరి, కంది, మొక్కజొన్న, మినుములు, పెసర, శెనగ, జొన్న తదితర పంటలకు రుణ పరిమితి పెంచలేదు. పత్తి సాగుకు రూ.2 వేలు మాత్రమే పెంచారు. గతేడాది రూ 46 వేల వరకు ఉండగా ఈసారి రూ 48 వేలకు పెరిగింది. పాడి రైతులకు డెయిరీ పెట్టుకోవడానికి అవుకు, గేదెకు రూ.33 వేల నుంచి రూ.35 వేల వరకు రుణం ఇవ్వాలని సూచించారు. గొర్రెలు, మేకలు కొనుగోలుకు సంబంధించి రూ.29 వేలు, ఒక్కో కోడిపిల్లకు రూ 200 నుంచి రూ 210 చొప్పున, చేపలు ఒక హెక్టార్‌కు రూ 4 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. స్కేల్‌ ఆప్‌ ఫైనాన్స్‌ ప్రకారం బ్యాంకర్లు రుణ లక్ష్యాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఫ పత్తికి విత్తన భారం...

పత్తిసాగు చేస్తున్న రైతులకు వానాకాలం సీజన్‌లో విత్తన భారం తప్పడం లేదు. ప్రతీయేటా విత్తన ధరలు పెరుగుతున్నా కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ లేకపోవడంతో ప్రైవేటు విత్తన కంపెనీల విత్తనాలు కొనుగోలు చేయడం వల్ల పత్తి రైతులకు విత్తన మోత తప్పడం లేదు. తాజాగా 2025-26 సంవత్సరానికి బీటీ-2 పత్తి విత్తన 475 గ్రాముల ప్యాకెట్‌ ధరను రూ.901 నిర్ణయిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతేడాది పత్తి విత్తన ప్యాకెట్‌ ధర రూ.864 ఉండగా ఈసారి రూ 37 అదనంగా పెంచుతూ నిర్ణయించింది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులపై అదనంగా రూ.30 లక్షల వరకు భారం పడుతుంది. జిల్లాలో మిడ్‌ మానేరు, మల్కపేట, అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లతో పాటు ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లోకి నీటిని నింపడం భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లోనూ నీటి మట్టాలు వానాకాలం సీజన్‌లో పెరుగుతున్న క్రమంలో జిల్లాలో రైతులు వరి పత్తిసాగు వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో జిల్లాలో లక్షకు పైగా ఎకరాల్లో పత్తి సాగు జరిగేది. ప్రస్తుతం 49,760 వేల ఎకరాల వరకు వానాకాలం సీజన్‌లో సాగుకు సిద్ధమయ్యారు. ఖరీఫ్‌లో రైతులు వరితో పాటు పత్తివైపు మొగ్గు చూపుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం విత్తన భారం వేసింది. గతేడాది పత్తి విత్తనాల ప్యాకెట్‌ రూ.864 ఉండగా ప్రస్తుతం 901 వరకు పెంచారు. ఒక ప్యాకెట్‌పై రూ.37 పెరిగింది. దీంతో పాటు ఎరువులు, మందులు, వ్యవసాయ కూలీల ధరలు రైతులకు మరింత భారాన్ని పెంచింది. ఈ సారి రైతులు దాదాపు రూ 30 లక్షల అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. ప్రతియేటా విత్తనాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పత్తి పండించే రైతులు ప్రైవేటులోనే విత్తనాఉల కొనుగోలు చేయాల్సి వస్తుంది. రైతులు ఎక్కువగా బీటీ 2 విత్తనాలనే వినియోగిస్తున్నారు. ఎకరానికి రెండుప్యాకెట్లకు పైగానే ఉపయోగిస్తారు. మరోవైపు అనుకూల పరిస్థితులులేని పక్షంలో రెండవ సారి కూడా విత్తనాలు వేసుకునే పరిస్థితి ఉంటుంది.

Updated Date - May 10 , 2025 | 12:40 AM