ఉగ్రవాద నిర్మూలనే మోదీ సర్కార్ లక్ష్యం
ABN , Publish Date - May 21 , 2025 | 11:53 PM
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
కరీంనగర్ స్పోర్ట్స్, మే 21 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా బుధవారం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. పెహల్గాం ఘటన తర్వాత దేశ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. ఉగ్రవాద నిర్మూలన కోసం జరిగే యుద్ధంలో అవసరమైతే సామాన్య ప్రజలు కూడా పాల్గొనేందుకు సిద్ధమయ్యారన్నారు. పాకిస్తాన్ భూ భాగంలోకి వెళ్లి అక్కడి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంతోపాటు ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘనత భారత సైన్యానిదన్నారు. టెర్రరిజాన్ని అణచివేసే శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయనే విషయాన్ని ప్రపంచమంతా గుర్తించిందన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకు అడ్డాగా మారిందని, టెర్రరిస్టులను ప్రోత్సహిస్తూ ఆ దేశం ఆర్థిక సాయం చేస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందన్నారు. ముంబై పేలుళ్లు, లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్లు, మక్కా మసీదు పేలుళ్ల తర్వాత దేశ ప్రజల్లో మార్పు వచ్చిందని, అవసరమైతే దేశం పక్షాన టెర్రరిజంపై యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉండడం సంతోషకమన్నారు. పాకిస్తాన్ భారత సరిహద్దు ప్రాంతాల్లో సామాన్య ప్రజలను, వారి ఆవాసాలను టార్గెట్ చేసి ధ్వంసం చేయాలనుకుందని, టెక్నాలజీని ఉపయోగించుకుని వాటిని తిప్పికొట్టిన ఘనత మన సైన్యానిదన్నారు. మోదీ నాయకత్వంలో అమిత్షా సారధ్యంలో టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా అంతం చేసేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మట్టుపెట్టాల్సిందేనని, ఇందులో మరో ఆలోచనే లేదన్నారు. యాంటీ టెర్రరిజం డే సందర్భంగా జిల్లా క్రికెట్ సంఘం ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ వి ఆగంరావు, కార్యదర్శి ఎన్ మురళీధర్రావు, ఉపాధ్యక్షులు పి మనోహర్రావు, కె రవీందర్గౌడ్, బండి శ్రవణ్కుమార్ పాల్గొన్నారు.