విలీన గ్రామాల్లో ‘ఉపాధి’ కరువు
ABN , Publish Date - May 10 , 2025 | 12:27 AM
కరీంనగర్ నగర పాలక సంస్థలో కొత్తపల్లి మండలంలోని చింతకుంట, మల్కాపూర్ గ్రామాలు విలీనమవడంతో ఉపాధి హామీ పనులు కనుమరుగయ్యాయి.

భగత్నగర్, మే 9 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ నగర పాలక సంస్థలో కొత్తపల్లి మండలంలోని చింతకుంట, మల్కాపూర్ గ్రామాలు విలీనమవడంతో ఉపాధి హామీ పనులు కనుమరుగయ్యాయి. దీంతో చింతకుంట, మల్కాపూర్, మల్కాపూర్ అనుబంధ గ్రామమైన లక్ష్మీపూర్ గ్రామాల్లో ఉపాధి హామి కూలీపైనే ఆధారపడి ఉన్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలోని చింతకుంటలో 645 జాబ్కార్డులుండగా, 759 కూలీలున్నారు. 457 మంది జాబ్కార్డులు యాక్టివ్గా ఉండగా, 513 మంది కూలీలు పనిచేసే వారు. మల్కాపూర్, లక్ష్మీపూర్లో 432 జాబ్కార్డులు ఉండగా, 547 మంది కూలీలు పనిచేస్తున్నారు. 342 యాక్టివ్ జాబ్కార్డులు ఉన్నాయి. 401 మంది కూలీలు రోజు వారీగా పనిచేసే వారు. వీరంతా ఉపాధి కరువై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తపల్లి మండలంలోని చింతకుంట, మల్కాపూర్ గ్రామాలను కరీంనగర్ కార్పోరేషన్లో విలీనం చేయడంతో ఉపాధి హామీ పథకాన్ని ఈ గ్రామాల్లో ప్రభుత్వం ఎత్తి వేశారు. ప్రభుత్వం ఈ గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయాలి ఉపాధి హామికూలీలు వేడుకుంటున్నారు.
ఫ కూలీలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయాలి
- భూక్య తిరుపతినాయక్, కొత్తపల్లి మాజీ వైస్ ఎంపీపీ
చింతకుంట, మల్కాపూర్ గ్రామాలు నగరపాలక సంస్థలో విలీనం కావడంతో ఉపాధి హామీ కూలీలు పనుల కోల్పోయారు. ఈ గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందికి మున్సిపాలిటీలో పని కల్పించారు. ఉపాధి హామీ కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయాలి.
ఫ ఉపాధి కరువు..
- దేనవేని రజిత, ఉపాధి హామీ కూలీ
ఉపాధి హామీ పథకాన్ని చింతకుంటలో ప్రభుత్వం తీసి వేయడంతో మాకు ఉపాధి కరువైంది. ప్రభుత్వం, అధికారులు ఉపాధి హామి కూలీలకు పనులు కల్పించి తమను ఆదుకోవాలి.
ఫ పనులు కల్పించాలి
- గుడాల సరిత, ఉపాధి హామి కూలీ, చింతకుంట
ఉపాధి హామీ పథకాన్ని తీసి వేయడంతో పనులు కోల్పోయిన మాకు పనులు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలి. గతంలో ఉపాధి హామీ కూలీపైనే ఆధారపడి జీవించే వాళ్లం. ఉపాధి హామీ పథకం తీసివేయడంతో పనులు దొరకక ఇబ్బందులు పడుతున్నాము. అధికారులు, ప్రభుత్వం కూలీ కల్పించాలి.