పీహెచ్సీల ఆవరణలో ఔషధ మొక్కలు పెంచాలి
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:59 PM
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణలో ఔషధ గుణాలున్న మొక్కలు పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.
తిమ్మాపూర్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణలో ఔషధ గుణాలున్న మొక్కలు పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. వార్డు, ల్యాబ్, మందులు ఇచ్చే గది విభాగాలను పరిశీలించారు. అక్కడికి ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారితో ఆమే మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణుల మాతా శిశు సంరక్షణ కార్డును పరిశీలించి టీకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాల ప్రాధాన్యాన్ని గర్భిణులకు వివరించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసవాలను పెంచాలన్ననరు. అనంతంర రామకృష్ణ కాలనీ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. తరగతిలో విద్యార్థులు కింద కూర్చోవడంతో అవసరమైన ఫర్నిచర్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఐదో తరగతి విద్యార్థులతో ఇంగ్లీష్ పాఠం చదివించారు. కొందరు వ్యక్తులు పాఠశాల ముగిసన తరవాత పాఠశాలలోకి ప్రవేశించి 30 మొక్కలను ఎత్తుకెళ్లినట్లు, వంట గది పరిసరాలను చెత్తగా చేస్తున్నారని పాఠశాల సిబ్బంది కలెక్టర్ తీసుకువెళ్లారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించాలని, అవసరమైతే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, దీనిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను కలెక్టర్ అదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో సురేందర్, ఎంఈవో శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ ప్రిసిల్లా పాల్గొన్నారు.