Share News

చిన్నారులకు వైద్య పరీక్షలు

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:01 AM

ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు చిన్నారులకు కంటి సమస్యలు, మానసిక సమస్యలు గుర్తించేందుకు పరీక్షలను నిర్వహిస్తున్నారు.

చిన్నారులకు వైద్య పరీక్షలు

జగిత్యాల, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు చిన్నారులకు కంటి సమస్యలు, మానసిక సమస్యలు గుర్తించేందుకు పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈనెల 7న వైద్య పరీక్షలు ప్రారంభించగా మూడు నెలల పాటు కొనసాగించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 0-6 ఏళ్లలోపు చిన్నారులు పౌష్టికాహారం పొందుతూ చదువుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేది పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలే. ఆయా పిల్లలు సరైన పర్యవేక్షణ లేక కంటి, మానసిక సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది. ఈ సమస్యలు చిన్న తనంలోనే గుర్తించి సరిచేసేందుకు ప్రభుత్వం వైద్య పరీక్షలకు శ్రీకారం చుట్టింది. ఇదివరకే రాష్ట్రీయ బాల్‌ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులకు రెండు విడతలుగా కంటి పరీక్షలను పూర్తి చేశారు. మూడో విడతగా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు పరీక్షలు చేయనున్నారు.

పరీక్షలు ఇలా....

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. సబ్‌సెంటర్ల వైద్య సిబ్బందితో పాటు ఆఫ్తాల్మిక్‌ నిపుణులు చిన్నారులకు కంటి పరీక్షలను నిర్వహిస్తారు. చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్‌వాడీ టీచర్‌ను భాగస్వాములను చేస్తూ చిన్నారులకు ప్రత్యేకంగా బొమ్మలతో రూపొందించిన చార్జ్‌ చూపిస్తూ ప్రశ్నించనున్నారు. దీంతో చూపు సరిగా ఉన్నదీ... లేనిదీ నిర్ధారించనున్నారు. చిన్నారులకు కంటిలో ఏమైనా మచ్చలున్నాయా, దృష్టితో పాటు, మెల్ల కన్ను, కార్నియా సమస్యలు, నిర్ధారిత దిశలో కళ్లు చూడకపోవడం, కళ్లల్లో తగినంత తేమ లేకపోవడం... పొడి బారుతుందా తదితర విషయాలపై ఆఫ్తాలిక్‌ నిపుణులు పరీక్షించనున్నారు. కంటి సమస్యలున్న చిన్నారులకు బోధనాసుపత్రుల్లో తగిన చికిత్సలు అందిస్తారు. మానసిక సమస్యలపై పీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బంది పరీక్షలు నిర్వహించనున్నారు. చిన్నారుల ఎదుగుదల, ఎత్తు, బరువు, మాటలు సరిగా వస్తున్నాయా, లేదా ఆయా వస్తువులను గుర్తిస్తున్నారా...లేదా ప్రవర్తనల్లో ఏమైనా మార్పులున్నాయా అనే అంశలను కూడా వైద్యులు అడిగి తెలుసుకుంటారు.

జిల్లాలో 1,065 అంగన్‌వాడీ కేంద్రాలు

జిల్లాలోని 1,065 అంగన్‌వాడీ కేంద్రాల్లో 0-6 సంవత్సరాల్లోపు వయస్సు గల చిన్నారులు 64,297 మంది ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు 891 మందికి పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్య ఉన్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. గతంలో ఆర్‌బీఎస్‌కే కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 2,474 మంది కంటి సమస్య ఉన్న విద్యార్థులను గుర్తించి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు.

పకడ్బందీగా వైద్య పరీక్షలు

-డాక్టర్‌ బోనగిరి నరేశ్‌, జిల్లా సంక్షేమశాఖ అధికారి

అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు కంటి, మానసిక ఎదుగుదలపై పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ఈనెల నుంచి చిన్నారులకు వైద్య పరీక్షలను ప్రారంభించాం. విద్యార్థులందరికీ పూర్తయ్యే వరకు సుమారు మూడు నెలల పాటు పరీక్షలు నిర్వహిస్తాం.

Updated Date - Apr 11 , 2025 | 01:01 AM