Share News

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:14 AM

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివరాణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివరాణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ప్రమాదాల జరిగే ప్రాంతాలను, జిల్లా యంత్రాంగం తరపున తీసుకోవాల్సిన చర్యలను పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాలశాఖ, మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో యూటర్న్‌లు ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం మాట్లాడుతూ అత్యాధునిక కెమెరాల సహాయంతో ట్రాఫిక్‌ పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నిబంధనలు పాటించని వాహనాలను ఈ కెమెరాలు ఆటోమేటిక్‌గా గుర్తిస్తాయని, వాహనదారులపై ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, ఆర్డీవో మహేశ్వర్‌, ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ శ్రీనివాస్‌, ఆర్టీఏ మెంబర్‌ పడాల రాహుల్‌ పాల్గొన్నారు.

ఫ మాదక ద్రవ్యాల నిర్మూలనకు చర్యలు

మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లాస్థాయి నార్కో కో-ఆర్డినేటర్‌ సెంటర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు సమన్వయంతో పని చేస్తూ జిల్లాను డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. డ్రగ్‌ టెస్ట్‌ కిట్ల ద్వారా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, అవసరమైతే డాగ్‌ స్క్వాడ్‌ వినియోగిస్తామని తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది 13 కేసులు నమోదు చేశామని, 13.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుకున్నామన్నారు.

ఫ బాలలను తల్లిదండ్రులకు చెంతకు చేర్చండి...

ఆపరేషన్‌ ముస్కాన్‌ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ బాల బాలికలను పని నుంచి విముక్తి కల్పించి తల్లిదండ్రుల చెంతకు చేర్చాలన్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా అన్ని పని ప్రదేశాల్లో బాలబాలికలను గుర్తించాలని, వారికి పని నుంచి విముక్తి కల్పించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, ఆర్డీవో మహేశ్వర్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ఇన్‌చార్జి డీడబ్ల్యూవో సబిత, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి, డీఈవో మొండయ్య, డీసీపీవో పర్వీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 12:14 AM