సుడా భవనానికి స్థలం కేటాయింపు
ABN , Publish Date - May 17 , 2025 | 01:18 AM
ఇంతకాలం అద్దె భవనాల్లో కొనసాగుతున్న శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)కి స్వంత భవన నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్ సమీపంలో కేడీసీసీ బ్యాంకు హెడ్ ఆఫీస్ ఎదురుగా సర్వే నెం. 285లో 7 గుంటల స్థలాన్ని కేటాయించి ఆ స్థలాన్ని కలెక్టర్ సుడాకు స్వాధీనం చేశారు.
- వన్టౌన్ పీఎస్ పక్కన 7 గుంటల స్థలం
- సుడా చైర్మన్కు స్వాధీనం చేసిన అధికారులు
- త్వరలో కొత్త భవన నిర్మాణం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఇంతకాలం అద్దె భవనాల్లో కొనసాగుతున్న శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)కి స్వంత భవన నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్ సమీపంలో కేడీసీసీ బ్యాంకు హెడ్ ఆఫీస్ ఎదురుగా సర్వే నెం. 285లో 7 గుంటల స్థలాన్ని కేటాయించి ఆ స్థలాన్ని కలెక్టర్ సుడాకు స్వాధీనం చేశారు. గతంలో ఈ స్థలంలో ఉన్న భవనంలో చాలాకాలం పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) కార్యాలయాన్ని నిర్వహించారు. అనంతరం దీనిని త్యాగరాజ లలిత కళాపరిషత్కు కేటాయించారు. ఈ పాత భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ప్రైవేట్ వ్యక్తులకు లాడ్జి, హోటల్, తదితర వ్యాపారాలు నిర్వహించుకోవడానికి గతంలో అద్దెకు ఇచ్చారు. ఆ తర్వాత దీనిని తమకే కేటాయించాలంటూ లీజుదారులు కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం స్థలాన్ని స్వాధీనం చేసుకుని భవనాన్ని కొంత మేరకు కూల్చివేసింది. ప్రస్తుతం ఆ స్థలాన్ని జిల్లా కలెక్టర్ సుడాకు కేటాయించారు. ప్రస్తుతం సుడా జిల్లా పరిషత్ భవనంలో 38 వేల రూపాయలు అద్దె చెల్లిస్తూ ఉంటూ వస్తున్నది. స్థలం కేటాయింపుతో సుడాకు స్వంత భవనం ఏర్పాటు కానున్నది. ఈ స్థలంలో మూడు ఫ్లోర్లలో భవన నిర్మాణం చేపట్టి ఒక ఫ్లోర్లో కన్వెన్షన్ సెంటర్, మరో ఫ్లోర్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామని మూడవ ఫ్లోర్ కార్యాలయం కోసం వినియోగించి సంస్థకు మరింత ఆదాయం చేకూర్చేలా భవనాన్ని డిజైన్ చేసి నిర్మిస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి చెప్పారు.