ఇంటి పరిసరాల్లో శుభ్రంగా ఉంచుకోవాలి
ABN , Publish Date - May 16 , 2025 | 11:59 PM
ఇంటి పరిసరాల్లో శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ వ్యాధి దినం సందర్భంగా శుక్రవారం కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
భగత్నగర్, మే 16(ఆంధ్రజ్యోతి): ఇంటి పరిసరాల్లో శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ వ్యాధి దినం సందర్భంగా శుక్రవారం కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం చెక్, క్లీన్, కవర్ అనే ప్రతిజ్ఞతో డెంగ్యూ దినం జరుపుకుంటున్నామని తెలిపారు. ఇన్ఫెక్టెడ్ ఆడ ఏడిస్ ఈజిప్ట్ దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నారు. దోమలు వృద్ధి చెందకుండా ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీరు నిల్వ ఉండే ట్యాంకులు, డ్రమ్ములు, ఇతర పాత్రలపై మూతలు ఉంచాలని, శరీరాన్ని కప్పిఉంచేలా దస్తులు ధరించాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలన్నారు. అధిక జ్వరం, తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పి, ముక్కు, చిగుళ్ల నుంచి తేలికపాటి రక్తస్రావం వంటి డెంగ్యూ లక్షణాలను ముందుస్తుగా సకాలంలో గుర్తిస్తే సరైన చకిత్స అందించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీవో డాక్టర్ రవీందర్రెడ్డి, పీవోడీటీ డాక్టర్ ఉమాశ్రీ, డీఐఓ డాక్టర్ సాజిదా, ఎన్సీడీ పీవో డాక్టర్ విప్లవశ్రీ, ఎంసీహెచ్పీవో డాక్టర్ సనజవేరియా, డీఎంవో డాక్టర్ శైలేంద్ర, డెమో రాజగోపాల్, డీపీవో స్వామి, మెడికల్ ఆఫీసర్ నజియా, సబ్ యూనిట్ ఆఫీసర్ రామనాథం, మల్లయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు.