కార్తీక పౌర్ణమి పరవశం...
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:07 AM
జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి పూజలు బుధవారం ఘనంగా జరిగాయి. భక్తులు ఇంటిల్లిపాది శివకేశవాలయాలను దర్శించి అభిషేక అర్చనల్లో పాల్గొన్నారు.
కరీంనగర్ కల్చరల్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి పూజలు బుధవారం ఘనంగా జరిగాయి. భక్తులు ఇంటిల్లిపాది శివకేశవాలయాలను దర్శించి అభిషేక అర్చనల్లో పాల్గొన్నారు. కార్తీక దీప, సాలగ్రామ దానాలతో పాటు తులసి కోటల వద్ద, ఆలయాల్లో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల్లో, ఇళ్ళ్లో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆలయాల అధికారులు, నిర్వాహకులు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యజ్ఞవరాహక్షేత్రం, మహాశక్తి ఆలయం, వాసవి కన్యకాపరమేశ్వరి, రాంనగర్ రమాసత్యనారాయణస్వామి ఆలయాల్లో పెద్దసంఖ్యలో భక్తులు సామూహిక సత్యనారాయణవ్రతాల్లో పాల్గొన్నారు. మళయాళ సద్గురు గీతామందిరంలో విష్ణుసేవానందగిరిస్వామి ఆధ్వర్యంలో చాతుర్మాస అఖండ భగవన్నామ జప మహాపూర్ణాహుతి జరిగింది. సాయంత్రం కార్తీక దామోదరుడికి దీపారాధనపూజలు చేశారు.