Karimnagar: సర్పంచ్లకు అన్ని విధాలా అండగా ఉంటాం..
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:17 AM
భగత్నగర్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్లకు అన్ని విధాలా అండగా ఉంటామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు.
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్
- బీజేపీ బలపరచిన సర్పంచ్లకు సన్మానం
భగత్నగర్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్లకు అన్ని విధాలా అండగా ఉంటామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఆయన కరీంనగర్లో శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీల నుంచి గెలిచిన సర్పంచ్లు ఈ నెల 18 లోపు వస్తేనే బీజేపీలో చేర్చుకుంటామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థులు అసూయ పడేలా బీజేపీ సర్పంచులున్న గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో సర్పంచ్లపై తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చే అవకాశముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నయా పైసా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఎంపీ లాడ్స్, సీఎస్సార్ ఫండ్స్తో పాటు, కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆయా గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని, అది తీవ్ర స్థాయికి చేరక ముందే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారన్నారు. త్వరలోనే ఆ ఎన్నికలు కూడా జరిగే అవకాశముందన్నారు. బీజేపీ కార్యకర్తలతోపాటు నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులంతా గ్రామాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. రెండో, మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునే విధంగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ కరీంనగర్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, బీజేపీ నాయకులు చెన్నమనేని వికాస్రావు పాల్గొన్నారు.