Karimnagar: యూరియా కొరత కేంద్రం నిర్వాకమే
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:55 PM
సైదాపూర్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): యూరియా కొరత రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
- రైతులు లైన్లలో నిలబడటం బాధ కలిగించింది
- ప్లాస్టిక్ను నివారించేందుకు మహిళలకు స్టీల్ బ్యాంకులు
- రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సైదాపూర్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): యూరియా కొరత రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ సైదాపూర్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నలరామయ్యపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకు సామగ్రి, ఆకునూర్లో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో డార్మెటరీ హాల్, ఓపెన్ జిమ్ ప్రారంభించారు. హహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకు సామగ్రి పంపిణీ చేశారు. వెంకటేశ్వర్లపల్లి, సోమారం గ్రామ పంచాయతీ పరిధిలోని బూడిదపల్లి గ్రామంలో ఓపెన్ జిమ్లు ప్రారంభించారు. ఎక్లాస్పూర్లో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించి, మహిళలకు స్టీల్ బ్యాంకు సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నది వాస్తవమేనన్నారు. కొన్ని నిజాలు ఒప్పుకోక తప్పదన్నారు. రైతులు లైన్లో నిలబడితే బాధేసిందని అన్నారు. యూరియా కొరతపై స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యత వహిస్తున్నానన్నారు. యూరియా కొరతపై ప్రతిరోజు కలెక్టర్తో మాట్లాడుతున్నానన్నారు. రైతులకు సరిపడా యూరియా తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేంద్రం నుంచి రాష్టానికి పరిపడా యూరియా రాకపోవడం వల్ల కొరత ఏర్పడుతున్నదన్నారు. ప్లాస్టిక్ను నివారిం చేందుకు మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకులను పంపిణీ చేస్తున్నామన్నారు. అన్ని గ్రామాలలో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పేద ప్రజల కల సాకారమైందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, వెన్కేపల్లి సింగిల్విండో అధ్యక్షుడు కొత్త తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుండారపు శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజ్కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.