Share News

karimnagar : రిజిస్ట్రేషన్‌కు నేటి నుంచి ‘స్లాట్‌బుకింగ్‌’

ABN , Publish Date - Jun 02 , 2025 | 01:08 AM

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇక నుంచి వేగవంతం, సులుభతరం కానుంది. అర్బన్‌ ఏరియాలోని ఇంటి స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్స్‌ వంటి ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం ఆన్‌లైన్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌ సోమవారంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్నది.

karimnagar :  రిజిస్ట్రేషన్‌కు నేటి నుంచి ‘స్లాట్‌బుకింగ్‌’

- ఒక్కో సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు రోజుకు 48 స్లాట్ల కేటాయింపు

- మరో 5 వాకిన్‌ రిజిస్ట్రేషన్‌లకు అనుమతి

- జిల్లాలోని నాలుగు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అమలు

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇక నుంచి వేగవంతం, సులుభతరం కానుంది. అర్బన్‌ ఏరియాలోని ఇంటి స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్స్‌ వంటి ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం ఆన్‌లైన్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌ సోమవారంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్నది. కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ట్రయల్‌రన్‌గా నడిచిన ఈ విధానం విజయవంతం కావటంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు అమలులోకి తీసుకురానున్నారు. రిజిస్ట్రేషన్‌.తెలంగాణ.జీఓటి.ఇన్‌ సైట్‌లోకి వెళ్లి ఆస్థుల రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ను క్లిక్‌ చేస్తే షెడ్యూల్‌ కనపడుతుంది. ఈ షెడ్యూల్‌లో ఆస్థుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సర్వే నెంబర్‌, విస్తీర్ణం, యజమాని ఆధార్‌నెంబర్‌, స్టాంపుడ్యూటీ తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం ఉంటేనే స్లాట్‌ బుక్‌ అవుతుంది. ఆస్తి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమాచారం దాదాపు 80 శాతం ఆన్‌లైన్‌లోనే పూర్తి అవుతుంది. నిషేధిత భూముల రిజిస్ట్రేషన్‌లు కాకుండా చెక్‌పాయింట్‌ ఉంటుంది. నిషేధిత సర్వే నెంబర్‌ రాగానే బుకింగ్‌ నిలిచిపోతుంది. ఇలా చాలా పకడ్బందీగా ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని తీసుకువచ్చారు. ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ కాగానే ఒక సమయం చూపి స్తుంది. ఆ సమయానికి ఒరిజినల్‌ డాక్యుమంట్లు తీసుకుని సబ్‌ రిజిస్ట్రార్‌ వద్దకు వెళ్లగానే సంబంధిత డాక్యుమెంట్లను పరిశీ లించి ఒకే చేయగానే 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్‌ పూర్తి అవుతుంది. ఆస్తి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు కూడా చేతికి అందనున్నాయి.

ఒక రోజు ముందుగానే స్లాట్‌ బుకింగ్‌

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రతి రోజు 48 స్లాట్‌ బుకింగ్‌లు చేసుకునేందుకు వీలు కల్పించారు. ప్రత్యేక పరిస్థితుల్లో, అనారోగ్యంకు గురైన, సీనియర్‌ సిటిజన్‌ల కోసం రోజుకు 5 వాకిన్‌ రిజిస్ట్రేషన్‌లకు అవకాశం కల్పించారు. వాకిన్‌ రిజిస్ట్రేషన్‌లకు ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌తో సంబంధం ఉండకుండా నేరుగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు సబ్‌రిజిస్ట్రార్‌లకు ప్రత్యేక అనుమతి కల్పించారు. ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ను ఒక రోజు ముందుగానే చేసుకోవాల్సి ఉంటుంది. కరీంనగర్‌లో ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్‌లు ఉన్నప్పటికీ 48 స్లాట్‌లకు మాత్రమే అనుమతి ఉంటుంది. వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్‌లకు సంబంధిత మండలాలలో తహసీల్దార్‌లు ధరణి పోర్టల్‌ ద్వారా దాదాపుగా ఇదే రకమైన ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ విధానంతో రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారు. ఇందులో మరికొన్ని మార్పులతో రూరల్‌ ఏరియాల్లో కూడా ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలు కానున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌ జిల్లాలో కరీంనగర్‌, కరీంనగర్‌ రూరల్‌(తిమ్మాపూర్‌), గంగాధర, హుజురాబాద్‌ నాలుగు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయా లున్నాయి. ఈ నాలుగు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌ స్లాట్‌బుకింగ్‌ విధానంతో సోమవారం నుంచి రిజిస్ట్రేషన్‌లు జరుగనుండటంతో దానికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌తో పాటు కంప్యూటర్‌ సామర్థ్యం, బాటరీ బ్యాకప్‌ తదితర ఆధునికీకరణ చర్యలు తీసుకున్నారు.

Updated Date - Jun 02 , 2025 | 01:08 AM