karimnagar : ఆదాయం పెంపునకు చర్యలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:42 AM
కరీంనగర్ టౌన్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు చర్యలు చేపట్టింది. ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్ను మదింపుపై ప్రత్యేక దృష్టి సారించింది.
- రెసిడెన్షియల్ టాక్సు చెల్లిస్తున్న కమర్షియల్ భవనాలపై దృష్టి
- విద్యుత్ మీటర్ల ఆధారంగా దాదాపు 10 వేల ఇళ్ల గుర్తింపు
- ఆస్తి పన్ను మదింపుపై పునఃపరిశీలన
కరీంనగర్ టౌన్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు చర్యలు చేపట్టింది. ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్ను మదింపుపై ప్రత్యేక దృష్టి సారించింది. నగరపాలక సంస్థ పరిధిలోని పలు భవనాలకు నివాస గృహాలుగా ఆస్తిపన్ను చెల్లిస్తూ వాణిజ్య అవసరాలకు వాటిని వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విద్యుత్ మీటర్ల ఆధారంగా పునఃపరిశీలన చేసి ఆస్తిపన్నులను వాణిజ్య విభాగంలోకి చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఫ కమర్షియల్ విద్యుత్ మీటర్లు 34.. భవనాలు 14 వేలు
నగరంలో కమర్షియల్ విద్యుత్ మీటర్లు 34 వేల వరకు ఉండగా, నగరపాలక సంస్థలో 14 వేల భవనాలకు మాత్రమే కమర్షియల్ టాక్సును చెల్లిస్తున్నారు. దీంతో మిగిలిన 20వేలలో కొంత మంది ఇంటి నిర్మాణ సమయంలో టెంపరరీగా విద్యుత్ మీటర్లను, అపార్టుమెంట్లు, పెద్దపెద్ద భవనాల్లో లిఫ్ట్, ఇతర అవసరాల కోసం కమర్షియల్ మీటర్లు తీసుకున్నట్లు తెలిసింది. అలాంటివి పోగా మరో 10 వేల వరకు రెసిడెన్షియల్ టాక్సు చెల్లిస్తూ వాణిజ్య అవసరాలకు భవనాలను వినియోగిస్తున్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో కమిషనర్ ప్రపుల్దేశాయ్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్, రెవెన్యూ అధికారులు, వార్డు ఆఫీసర్లు కమర్షియల్ మీటర్ ఇంటి నంబర్ల ఆధారంగా ప్రాపర్టీ టాక్సును నిర్ధారించే పనిలో నిమగ్నమయ్యారు. కొన్ని చోట్ల రోడ్లకు ఆనుకొని ఉన్న ఇంట్లో లేదా భవనంలో నివాసముంటూనే ఖాళీ స్థలాల్లో షట్టరు వేసి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి వాటిని గుర్తించి వాటికి కమర్షియల్ టాక్సు వసూలు చేస్తే ఆస్తిపన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.
ఫ పన్నుల సవరణలో అధికారులు
వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ అధికారులే కాకుండా కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు పునఃపరిశీలనలో పాల్గొని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న ఇళ్ల విస్తీర్ణాన్ని బట్టి ఆస్తిపన్నులను సవరించేందుకు నోటీసులు జారీ చేస్తున్నారు. సంబంధిత ఇంటి యజమానుల డాక్యుటెంట్లను పరిశీలించి పన్నులను సవరిస్తున్నారు. ఇప్పటికే భువన్ యాప్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్కు పన్నులు చెల్లించి ఆపై అంతస్తులను నిర్మిస్తే వాటిని సవరించడం ద్వారా బల్దియా ఆదాయం పెరిగింది. కమర్షియల్కు వినియోగిస్తున్న ఇళ్లకు ఆ కేటగిరీ టాక్సు వేయడం ద్వారా మరింత ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.
ఫ గ్రామాల విలీనంతో పెరిగిన నగర విస్తీర్ణం
నగరంలో కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు శివారులోని పద్మనగర్, చింతకుంట, మల్కాపూర్, రేకుర్తి, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, గోపాల్పూర్, దుర్శేడ్, బొమ్మకల్, సదాశివపల్లి, అల్గునూర్ గ్రామాలను విలీనం చేయడంతో నగర విస్తీర్ణం దాదాపు రెట్టింపు అయింది. విలీన గ్రామాలతో కలిపి డివిజన్ల సంఖ్య 66కు చేరింది. అలాగే జనాభా కూడా నాలుగు లక్షలకుపైగానే ఉన్నది. ఇటీవల చేసిన విలీన గ్రామాలకు ముందు 60 డివిజన్లలో అధికారిక లెక్కల ప్రకారం 90 వేల వరకు నివాస, వాణిజ్య భవనాలు ఉండేవి. గ్రామాల విలీనంతో భవనాల సంఖ్య 1,02,000కు చేరింది. ఆస్తిపన్ను ద్వారా నగరపాలక సంస్థ ఏటా ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేట్ నివాస, వాణిజ్య గృహాల ద్వారా యేటా 59.14 కోట్ల మేరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఆస్తి పన్ను ను సవరించడం ద్వారా పెరిగే ఆదాయంతో అభివృద్ధి పనులకు నిధులను ఖర్చుచేసే అవకాశాలుంటాయని చెబుతున్నారు.