karimnagar : ఆత్మగౌరవం ఇదేనా ?
ABN , Publish Date - May 05 , 2025 | 12:25 AM
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి ఆత్మగౌరవంతో బతికేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది.
- బీసీ స్టడీ సర్కిల్లో మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా ఉచిత భోజనం
- స్టడీసర్కిల్లో ఇచ్చేది టీ, బిస్కెట్ మాత్రమే
- ప్రభుత్వమే సమకూర్చాలంటున్న అభ్యర్థులు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి ఆత్మగౌరవంతో బతికేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ఆచరణలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. సాక్షాత్తూ బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత జిల్లాలో వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమకు ఆత్మగౌరవం ఎక్కడ ఉందంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ ఐటీ పార్కు సమీపంలో బీసీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేసింది. కొన్ని సంవత్సరాలుగా ప్రతి పోటీ పరీక్షలోనూ మెరుగైన ఫలితాలను సాధిస్తూ వస్తున్నది.
ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీసీ అభ్యర్థులు వివిధ పరీక్షలకు సిద్ధం కావడానికి బీసీ స్టడీ సర్కిల్కు వస్తున్నారు. స్టడీ సర్కిల్కు వచ్చేవారికి బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేసుకుని ప్రభుత్వం పక్షాన ఒక బిస్కెట్ ప్యాకెట్, టీ మాత్రమే సమకూర్చేవారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వందకుపైగా కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి చదువుకుంటున్న వారికి మధ్యాహ్నం పూట భోజనం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయంపూట ఇంటి నుంచి తెచ్చుకోలేక జిల్లా కేంద్రంలో ఒక్కో భోజనానికి 150 రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి రావడంతో తక్కువ ధరలో లభించే టిఫిన్, ఇతర ఆహార పదార్థాలతో తిని కడుపునింపుకోవాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ తన సొంత ఖర్చులతో విద్యార్థులకు స్టడీ సర్కిల్లో భోజన వసతి ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారడంతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది.
ఫ కలెక్టర్ చొరవతో లయన్స్ క్లబ్ భోజనం
ప్రస్తుతం 150 మంది విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల కోసం ఇక్కడ సిద్ధమవుతున్నారు. వారికి మధ్యాహ్న భోజన సమస్య పునరావృతం కావడంతో ఇటీవల మాజీ కార్పొరేటర్ జంగిలి అయిలేందర్ యాదవ్ కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి బీసీ స్టడీ సర్కిల్లో పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి భోజన వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మంత్రి గంగుల కమలాకర్ ఈ సౌకర్యాన్ని కల్పించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పరిస్థితిని గమనించిన కలెక్టర్ స్థానికంగా ఉన్న లయన్స్క్లబ్ వారిని సంప్రదించి వారి మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా ఈ విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పించే ఏర్పాటు చేశారు. బీసీ స్టడీ సర్కిల్లోకి జ్యోతిబా పూలే పాఠశాలను షిఫ్టు చేయడంతో ప్రస్తుతం స్టడీ సర్కిల్కు విద్యార్థులకు లైబ్రరీ రూం మాత్రమే మిగిలింది. ఈ కేంద్రానికి అధ్యయనం కోసం వచ్చే వారు భోజనం చేయాలంటే ఆరుబయటకు వెళ్లాల్సిందే. మీల్స్ ఆన్ వీల్స్ వాహనం రాగానే విద్యార్థులు దాని వద్దకు వెళ్లి భోజనం పట్టుకుని అక్కడే తిని రావాల్సిన పరిస్థితి ఉన్నది.
ఫ డైనింగ్ హాల్ లేక ఇబ్బందులు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి కోట్లాది రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం స్టడీ సర్కిల్కు వచ్చే విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన వసతిని ఏర్పాటు చేయలేని స్థితిలో ఉందా అని ప్రశ్నిస్తున్నారు. దాతలు ఉచితంగా సమకూర్చే భోజనంపై ఆధారపడుతున్నామని, ఆత్మగౌరవం గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ ఉందంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని స్టడీ సెంటర్లకు హాజరయ్యేవారికి టీ, బిస్కెట్తోపాటు మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పించాలని కోరుతున్నారు. పుస్తకాలు మాత్రమే సమకూర్చడం కాకుండా నెలలో ఒకటి రెండు రోజులు ముఖ్యమైన సబ్జెక్టులపై క్లాసులు కూడా నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ స్టడీ సెంటర్లో కూర్చుని భోజనం చేసేవిధంగా డైనింగ్హాల్ను కల్పించాలని, వచ్చే విద్యాసంవత్సరంలోగా ఈ సెంటర్లోకి మార్చిన జ్యోతిబాపూలే పాఠశాలను దాని శాశ్వత భవనంలోకి మార్చాలని బీసీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్టడీ సెంటర్ను సందర్శించి ఇక్కడి పరిస్థితులను పరిశీలించి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్టడీ సెంటర్లలో మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు కోసం ముఖ్యమంత్రితో చర్చించి తగిన ఉత్తర్వులు ఇప్పించాలని వారు కోరుతున్నారు.