karimnagar : స్నాతకోత్సవానికి ముస్తాబు
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:32 AM
గణేశ్నగర్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): శాతవాహన యూనివర్సిటీ ద్వితీయ స్నాతకోత్సవానికి ముస్తాబైంది.
- నేడు శాతవాహనలో వేడుకలు
- హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్డీ పట్టాల పంపిణీ
గణేశ్నగర్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): శాతవాహన యూనివర్సిటీ ద్వితీయ స్నాతకోత్సవానికి ముస్తాబైంది. ఈ ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరుకానుండటంతో భారీ బందోబస్తు మధ్య పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. వర్సిటీ ఆవరణలోని క్రీడామైదానంలో వేదిక ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వవిద్యాలయం పరిధిలో 2018నుంచి 2023 వరకు ప్రతిభ కనబర్చిన 161 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 25 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు అందించనున్నారు. పట్టాలు అందుకునే విద్యార్థులు తమ పేర్లు, మొబైల్ నంబరు, ఫొటో, ఈమెయిల్ ఐడీలను విశ్వవిద్యాలయ వెబ్సైట్లో నమోదు చేయడంతో దాని ఆధారంగా వేదిక వద్ద వారికి సీట్లు కేటాయిస్తున్నారు. విద్యార్థులతో పాటు ఒకరి మాత్రమే వర్సిటీలోకి ఆనుమతి ఉంటుంది. ఉదయం 10 గంటలకు స్నాతకోత్సవం ప్రారంభమవుతుందని శాతవాహన విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. కార్యక్రమానికి గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షత వహించి స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బీజే రావు కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఫ వేడుకలకు సర్వం సిద్ధం
శాతవాహన విశ్వవిద్యాలయం క్రీడా మైదానం వేదికగా 1500 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. అతిథులకు, పీహెచ్డీ స్కాలర్లు వారి తల్లిదండ్రులు, బంగారు పతకాలు స్వీకరించే విద్యార్థులకు ప్రత్యేక సీట్లు కేటాయించారు. ఇతరులు వీక్షించేందుకు వేదిక వద్ద ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అతిథులకు భోజన సదుపాయం కాల్పించారు.
ఫ విజయవంతంగా నిర్వహిస్తాం
- ఎస్యూ ఉపకులపతి ఉమేష్కుమార్
విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న రెండో స్నాతకోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఆన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. స్నాతకోత్సవ కార్యక్రమం శాతవాహన విశ్వవిద్యాలయ అభివృద్ధిలో మైలురాయిగా మారనుంది. విద్యార్థులలో అత్మవిశ్వాసం పెంపొంది వారి లక్ష్య సాధనకు దోహదం చేస్తుంది. శాతవాహన విశ్వవిద్యాలయం వేడుకలకు ముస్తాబు చేయడంతో పండుగ వాతావరణం నెలకొన్నది.