Share News

Karimnagar: యూరియా కోసం రైతులు బారులు

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:21 AM

హుజూరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. హుజూరాబాద్‌ పట్టణంలోని సింగిల్‌ విండో కార్యాలయం ఎదుట రైతులు శుక్రవారం బారులు తీరారు.

 Karimnagar:   యూరియా కోసం రైతులు బారులు

- ఇబ్బందులు పడుతున్న అన్నదాత

హుజూరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. హుజూరాబాద్‌ పట్టణంలోని సింగిల్‌ విండో కార్యాలయం ఎదుట రైతులు శుక్రవారం బారులు తీరారు. తెల్లవారు జామునే భారీగా తరలివచ్చి లైన్‌ కట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సొసైటీ వద్దకు చేరుకొని రైతులను క్యూలైన్లో ఉంచి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు.

ఫ శంకరపట్నం:కన్నాపూర్‌, కాచాపూర్‌, ఆముదాలపల్లి, కరీంపేట గ్రామాల్లోని గోదాములకు యూరియా బస్తాలు రాగా రైతులు ఆధార్‌ జిరాక్స్‌లతో క్యూ కట్టారు. ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియాను అందించారు.కరీంపేట గ్రామంలో రైతులు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. కన్నాపూర్‌ గ్రామంలో పోలీస్‌ పహారా మధ్య బస్తాలను పంపిణీ చేశారు.

ఫ సైదాపూర్‌ : మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఎరువుల దుకాణానికి యూరియా వస్తున్నదని తెలిసి రైతులు గోదాము వద్ద క్యూ కట్టారు. షాపు యజమానికి ఒకొక్కరికి ఒక్కో బస్తా చొప్పున టోకెన్లు ఇచ్చి పంపిణీ చేశారు. చివరి రైతుకు అందకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.

ఫ తిమ్మాపూర్‌ : మండలంలోని నుస్తులాపూర్‌ సొసైటీకి 340, మల్లాపూర్‌ గ్రామానికి 220, పర్లపల్లి గ్రామానికి 220 బస్తాల యూరియా వచ్చింది. నుస్తులాపూర్‌ సొసైటీలో టోకెన్లు ఎక్కువగా ఇవ్వడంతో అందరికీ అందలేదు. ఒక్కొక్కరికి ఒక్కో బస్తా పంపిణీ చేశారు. గతంలోనే టోకెన్లు ఇచ్చిన మిగతా వారికి మళ్లీ లోడ్‌ వచ్చిన తర్వాత పంపిణీ చేస్తామని తెలిపారు.

Updated Date - Sep 06 , 2025 | 12:21 AM