Share News

Karimnagar: విపత్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు ఆపదమిత్ర వలంటీర్లు ముందుండాలి

ABN , Publish Date - Jul 17 , 2025 | 11:14 PM

కరీంనగర్‌ క్రైం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే విపత్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు ఆపదమిత్ర వలంటీర్లు ముందుండాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు.

 Karimnagar:  విపత్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు ఆపదమిత్ర వలంటీర్లు ముందుండాలి

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి

- కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ క్రైం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే విపత్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు ఆపదమిత్ర వలంటీర్లు ముందుండాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. రెవెన్యూ శాఖ విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో 142 మంది డిగ్రీ విద్యార్థులు, ఎన్‌సీసీ వలంటీర్లకు కరీంనగర్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో 12 రోజుల పాటు ఆపదమిత్ర శిక్షణ ఇచ్చారు. గురువారం శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరైన కలెక్టర్‌ ఆపదమిత్ర వలంటీర్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవగాహన లేకపోవడం వల్ల నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగు తున్నాయని అన్నారు. ఈ ప్రమాదాలు ఎదుర్కొనేందుకు గ్రామాల్లో, పట్టణాల్లో పనిచేసే ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వలంటీర్లకు మొదటి విడతలో శిక్షణ ఇచ్చామని తెలిపారు. రెండో విడతలో డిగ్రీ విద్యార్థులు, ఎన్‌సీసీ వలంటీర్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నా రని అన్నారు. శిక్షణలో భాగంగా ఫైర్‌, పోలీస్‌, పంచాయతీరాజ్‌, వైద్యశాఖ, పశుసంవర్ధక శాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రతి విపత్తునూ ఎదుర్కొనే విధంగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, పాము, కుక్కకాటు, అగ్నిప్రమాదం, సిపిఆర్‌, షాట్‌ సర్క్యూట్‌, వరదలు, రోడ్డు ప్రమాదాలు సంభవించి నప్పుడు ఆపదమిత్ర వలంటీర్లు ముందుండి ప్రజల ప్రాణాలను రక్షించాలని అన్నారు. నైపుణ్యాలతో కూడిన ఆపదమిత్ర శిక్షణతో తమను తాము రక్షించుకోవడంతో పాటు పది మంది ప్రాణాలు కాపాడగలరని పేర్కొన్నారు. నైపుణ్యాలను, మెళకువలను మరో పదిమందికి నేర్పించాలని సూచించారు. ఆపద ఎప్పుడైనా రావచ్చని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. రానున్న రోజు ల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంలోనూ ఆపద మిత్రులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి ఎం శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 11:15 PM