Karimnagar: ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:20 AM
కరీంనగర్ కల్చరల్, డిసెంబర్ 25 (ఆంధ్రజ్యోతి) : ఏసుక్రీస్తు నామస్మరణలు... ప్రార్థనలు.. సందేశాలు... గీతాలతో గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
కరీంనగర్ కల్చరల్, డిసెంబర్ 25 (ఆంధ్రజ్యోతి) : ఏసుక్రీస్తు నామస్మరణలు... ప్రార్థనలు.. సందేశాలు... గీతాలతో గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కేక్లు కోసి సంబరాలు చేసుకున్నారు. హాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బైబిల్ను పఠించారు. ఆయా చర్చ్లలో క్వాయర్ బృందం, యువతీ యువకులు, విద్యార్థుల గీతాలు అలరించాయి. సీపీ నివాసానికి ఎదురుగా సీఎస్ఐ వెస్లి కెథడ్రల్ చర్చిలో ఫాస్టరేట్ చైర్మన్ పాల్ కొమ్మాలు ప్రార్థనలు చేయించి సందేశమిచ్చారు. క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని, యేసు లోకంలో జన్మించి శాంతి, సమాధానంతో, ప్రేమతో వ్యక్తి మెలగే రీతిని తన జీవితం ద్వారా తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్బిటర్ మధుమోహన్, ఫాస్టరేట్ సెక్రెటరీ జిబి సంజయ్ కుమార్, కోశాధికారి ముల్కల సంజయ్, డైసస్ లే సెక్రటరీ ఎర్ర జాకబ్, చర్చ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. క్రిస్టియన్ కాలనీ సీఎస్ఐ సెంటినరీ వెస్లి చర్చిలో ఫాస్టరేట్ చైర్మన్ ఎస్ జాన్ ప్రత్యేక ప్రార్థనలను చేసి సందేశమిచ్చారు. యేసు చూపిన బాటలో నడిచి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని, క్రీస్తు పాపాలను క్షమించి సన్మార్గంలో నడిపిస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రెస్బిటర్ పింటూ, సెక్రెటరీ సి సంజయ్ కుమార్, కోశాధికారి సి నారాయణ పాల్గొన్నారు. లూర్దు మాతా చర్చ్లో ఫాదర్ తుమ్మ సంతోష్రెడ్డి ప్రార్థనలు చేయించి సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫాస్టర్ దేవరాజ్, చర్చి కమిటీ సభ్యులు డి ఇన్నారెడ్డి, బి జార్జిరెడ్డి, పి జోసఫ్ రాజ్, ఎస్ మరియ కుమార్, వివిధ డివిజన్లు, మండలాలు, గ్రామాలతో పాటు క్రైస్తవుల గృహాల్లో ప్రార్థనలు, క్రీస్తు జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.