Share News

Karimnagar: వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 23 , 2025 | 12:43 AM

కరీంనగర్‌, మే 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.

Karimnagar:  వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి

- ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

- కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌, మే 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో వివిధ శాఖల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాల కారణంగా ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నాలాలో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించి డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిథిలావస్థకు చేరిన పాత ఇళ్లు వర్షాలకు నాని కూలిపోయే అవకాశం ఉన్నందున అక్కడ నివసించే వారిని ఖాళీ చేయింవలసిందిగా సూచించాలన్నారు. ఐరన్‌ విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ లైన్లు ట్రాన్స్‌ఫార్మర్ల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. రోడ్లపై ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలను పూడ్చాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులకు సూచించారు. మున్సిపల్‌ శాఖలోని డీఆర్‌ఎఫ్‌ టీం అప్రమత్తంగా ఉండాలన్నారు. అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో ఆపదమిత్ర శిక్షణ పొందిన వలంటీర్లను వినియోగించుకోవాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలని, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో మహేశ్వర్‌, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 12:43 AM