Share News

Karimnagar : ఓట్‌చోరీతోనే బండి సంజయ్‌ గెలుపు

ABN , Publish Date - Aug 25 , 2025 | 02:06 AM

కరీంనగర్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఓట్‌చోరీతోనే కరీంనగర్‌లో బండి సంజయ్‌కుమార్‌ గెలుపొందాడని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ విమర్శించారు.

Karimnagar :   ఓట్‌చోరీతోనే బండి సంజయ్‌ గెలుపు

- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు

- టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌

కరీంనగర్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఓట్‌చోరీతోనే కరీంనగర్‌లో బండి సంజయ్‌కుమార్‌ గెలుపొందాడని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ విమర్శించారు. ఆదివారం గంగాధర మండలంలో కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి నిర్వహించిన జనహిత పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మధురానగర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు దొంగోట్లతోనే గెలిచారన్న అనుమానాలు ఉన్నాయన్నారు. రాహుల్‌గాంఽధీ బయటపెట్టిన ఓటర్‌ జాబితా చూస్తే స్పష్టమవుతుందన్నారు. లక్షలకుపైగాదొంగ ఓట్లు చేర్చడం, ఒకే అడ్రస్‌పై వందల ఓట్లు, జీరో అడ్రస్‌లపై వేల ఓట్లు ఉన్నాయన్నారు. ఒకే ఎపిక్‌ నంబర్‌పై వేర్వేరురాష్ట్రాల్లో ఓట్లు ఉండటం ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు.

ఫ ఎన్నికలు వస్తేనే బీజేపీకి దేవుళ్లు గుర్తుకువస్తారు..

ఎన్నికలు వస్తే బీజేపీకి దేవుళ్లు గుర్తుకు వస్తారని, దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడం ఏంటన్నారు. రాముడి అక్షంతలను సైతం రాజకీయాలకు వాడుకుంటున్నారన్నారు. దేవుళ్ల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ఏనాడైనా ఓట్లు అడిగిందా అని ప్రశ్నించారు. కులం మతం లేక పోతే బీజేపీ గెలవలేదన్నారు. దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లని, కొండగట్టు అంజన్న పేరుతో బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారన్నారు. ఎన్నికలు వస్తే వారికి హిందూ, ముస్లింల కొట్లాట గుర్తుకు వస్తుందని అన్నారు. బండి సంజయ్‌ బీసీల గురించి ఏనాడైనా మాట్లాడావా అని ప్రశ్నించారు. బీసీల గురించి రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లతో బిల్లును రూపొందించి డిల్లీకి పంపిస్తే ఆమోదించడం లేదని విమర్శించారు. బండి సంజయ్‌ నిజమైన బీసీ నాయకుడు కాదని, బీసీల బిల్లుపై మాట్లాడకుండా ఢిల్లీలో కిషన్‌రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడన్నారు. బండి సంజయ్‌ బీసీల్లో ఉన్న దేశ్‌ముఖ్‌ అని విమర్శించారు. బండి సంజయ్‌ భవిష్యత్‌ బీసీ తరాలకు ద్రోహం చేస్తున్నాడన్నారు. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఏనాడూ పేదల గురించి ఆలోచించలేదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే మూడు ముక్కలైందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా కనుమరుగవుతుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లతో గెలుపొంది చొప్పదండిలోనే విజయోత్సవ సమావేశం నిర్వహిస్తామన్నారు.

- కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ మాట్లాడుతూ పేదల కష్టాలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నామన్నారు. పేదల కళ్లలో ఆనందం చూడడమే కాంగ్రెస్‌ ధ్యేయమన్నారు. కాంగ్రెస్‌ నేత వెంకటస్వామి సేవలను గుర్తు చేస్తూ తెలంగాణలో ఆయన పేరుతో తెలియని వారు లేరన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, గడ్డం వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, శాసన సభ్యుడు మేడిపల్లి సత్యం, మక్కాన్‌సింగ్‌, ప్రభుత్‌ విప్‌ ఆదిశ్రీనివాస్‌, ప్రభుత్వ సలహాదారు హర్కార్‌ వేణుగోపాల్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ సత్తు మల్లేశం, పార్లమెంట్‌ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బొంతు రాంమ్మోహన్‌, రుద్ర సంతోష్‌, అల్ఫోర్స్‌ అధినేత నరేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఫ చివరి రక్తం బొట్టు వరకు సేవ చేస్తా

- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర: తన చివరి రక్తంబొట్టు వరకు చొప్పదండి నియోజకవర్గానికి సేవ చేస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా గంగాధర మండలం మధురానగర్‌లో ఏర్పాటు చేసిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లు అధికారంలో దోచుకున్నదని విమర్శించారు. ఒక్క ఎకరానికైనా కొత్తగా బీఆర్‌ఎస్‌ వాళ్లు నీళ్లు ఇవ్వలేదని, ఒకవేళ ఇచ్చి ఉంటే నేలకు ముక్కు రాస్తానని అన్నారు. నారాయణపూర్‌ ఎత్తు పెంచి సాగు ఆయకట్టు పెంచతామని, కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

ఫ ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడ లేవు...

- మాజీ మంత్రి టి జీవన్‌ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడా లేవని మాజీ మంత్రి టి జీవన్‌రెడ్డి అన్నారు. పేదవాడికి పట్ట్టెడు అన్నం పెట్టాలని సన్నబియ్యం ఇస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం దశాబ్దకాలంలో పేదలకు ఒక్క ఇల్లు అయినా కట్టారా అని ప్రశ్నించారు. గృహ నిర్మాణ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు. భారత్‌ జోడో యాత్ర చేపట్టి రాహుల్‌గాంధీ రెండు రాష్ర్టాల్లో పార్టీని అధికారంలోకి తెచ్చారని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌ ప్రకారం 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నామన్నారు.

ఫ బీసీ రిజర్వేన్లు ఇచ్చి తీరుతాం

- రాజ్యసభ మాజీ ఎంపీ వి హన్మంతరావు

బీసీ రిజర్వేషన్ల ఇచ్చి తీరుతామని రాజ్యసభ మాజీ ఎంపీ వి హన్మంతరావు అన్నారు. తనకన్నా పెద్ద రామభక్తుడు ఎవ్వరని ప్రశ్నించారు. దేవుళ్ల పేరిట బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

Updated Date - Aug 25 , 2025 | 02:06 AM