jagityaala : పరిష్కారం దిశగా అడుగులు..
ABN , Publish Date - May 05 , 2025 | 12:50 AM
జగిత్యాల, మే 4 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో నూతన విధి విధానాలతో భూ భారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
-జిల్లాలో అమల్లోకి భూ భారతి చట్టం
-పైలట్ ప్రాజెక్టుగా బుగ్గారం మండలం ఎంపిక
-నేడు లాంఛనంగా ప్రారంభానికి ఏర్పాట్లు
-రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
జగిత్యాల, మే 4 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో నూతన విధి విధానాలతో భూ భారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గత నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని నాలుగు మండలాలను పైలట్ మండలాలుగా ఎంపిక చేసి అమలు చేసింది. అనంతరం అన్ని జిల్లాల్లో ఒక్కో మండలాన్ని రెండో విడత పైలట్ మండలంగా ఎంపిక చేసి ఈనెల 5వ తేదీ నుంచి భూ భారతి అమలు చేయడానికి నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని బుగ్గారం మండలాన్ని భూ భారతి పైలెట్ ప్రాజెక్టు మండలంగా ఎంపిక చేశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ చేతుల మీదుగా అమలును ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నో ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న భూ సమస్యలు భూ భారతితోనైనా పరిష్కారం అవుతాయని రైతులు ఆశిస్తున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల అభిప్రాయాలు సేకరించడంతో పాటు క్షేత్ర స్థాయిలో ఉన్నతాధికారులు పర్యటించి భూ సమస్యలకు పరిష్కారం చూపనున్నారు.
ఫరెండు బృందాలుగా అధికారులు..
బుగ్గారం మండలంలో అధికారులను రెండు బృందాలుగా విభజించి గ్రామ సభలను నిర్వహించడానికి ప్రణాళికను ఖరారు చేశారు. ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు నిర్ణీత రెవెన్యూ గ్రామాల్లో సభలు నిర్వహించనున్నారు. మొదటి బృందంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తుండగా బుగ్గారం తహసీల్దార్ మజీద్, నాయబ్ తహసీల్దార్ శ్రీకాంత్, రికార్డు అసిస్టెంట్ స్వామి, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్లు బృందం సభ్యులుగా ఉన్నారు. ఈనెల 5వ తేదీన యశ్వంతరావుపేట, 6న శెకల్లా, 7న గంగాపూర్, 8న గోపులాపూర్, సివంచకోట, 9న బుగ్గారంలో సభలు నిర్వహిస్తారు. రెండో బృందంలో ల్యాండ్ అండ్ సర్వే విభాగం ఏడీ వెంకట్రెడ్డి ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తుండగా ధర్మపురి తహసీల్దార్ క్రిష్ణ చైతన్య, గిర్దావర్ బాపురెడ్డి, సీనియర్ అసిస్టెంట్ సురేందర్రావు, జూనియర్ అసిస్టెంట్ జనార్దన్లు బృందం సభ్యులుగా ఉన్నారు. వీరు ఈనెల 5వ తేదీన మద్దునూరు, 6న సిరికొండ, 7న వెల్గొండ, 8న చిన్నాపూర్లలో గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించనున్నారు.
ఫమండలంలో 19,735 ఎకరాల భూమి
బుగ్గారం మండలం పరిధిలో 10 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటి పరిధిలో 19,735.36 ఎకరాల భూ విస్తీర్ణం ఉంది. ఇందులో 360.35 ఎకరాల ఆబాది, నద్దినాలా, రాస్తా భూములున్నాయి. మండలంలో 2,474.25 ఎకరాల అటవీ భూమి, 7,113.20 ఎకరాల ప్రభుత్వ భూమి, 716.38 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. మండలంలో 303.10 ఎకరాలకు చెందిన 358 పెండింగ్ ఖాతాలున్నాయి. 903 సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
ఫసాదా బైనామాలకు మోక్షం
రెవెన్యూ రికార్డుల్లో గతంలో పట్టాదారు కాలమ్తో పాటు కబ్జాదారు కాలమ్ కూడా ఉండేది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చినప్పుడు కబ్జా కాలమ్ను తొలగించి పట్టాదారు కాలమ్ను మాత్రమే రికార్డుల్లో ఉంచింది. దీంతో గతంలో భూములు కొని పట్టాలు చేసుకోని వారు, సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన వారు కబ్జాల్లో ఉన్నప్పటికీ వారికి ఆ భూమిపై హక్కులు లేకుండా పోయాయి. గతంలో అమ్ముకున్న వారికే ధరణిలో కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. ధరణి అమలులో భాగంగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూములన్నింటినీ ఆన్లైన్ చేసే సందర్భంలో ఒకరి పేరు మీద ఉన్న భూమి మరొకరి పేరుతో పట్టాలు ఎక్కడం, కొందరికి భూమి తక్కువగా, మరికొందరికి ఎక్కువగా పాస్ బుక్కుల్లో నమోదయ్యాయి. కొందరు తమ భూములను అమ్ముకున్నప్పటికీ వారే దొడ్డిదారిన ఆ భూమిని పాస్బుక్కుల్లో ఎక్కించుకోవడం, మరికొందరు కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ ఒక్కరే పట్టా చేయించుకోవడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి వాటికి ధరణిలో పరిష్కారం దొరకలేదు. దాంతో కోర్టుకు వెళ్ల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూ భారతీ ద్వారా ఇలాంటి సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించుకునే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాకపోతే ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవడం, అక్కడా పరిష్కారం కాకపోతే కలెక్టర్కు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ధరణిలో పాస్బుక్ పొందిన పట్టాదారుడే తిరిగి వేరే వారికి పట్టా చేస్తేనే పేరు మారేది. అధికారులకు దానిని మార్చే అధికారం లేకపోవడంతో చాలా సమస్యలు పెండింగ్లో ఉండేవి. అలాంటి వాటికి భూ భారతిలో మోక్షం లభించనుంది. ధరణిలో స్లాట్ బుక్ చేసుకొని అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్ ఆగిపోతే ఆ డబ్బులు రైతులకు వచ్చేవి కావు. అలాంటివి ఇప్పుడు పరిష్కారయ్యే అవకాశం ఉంది. పట్టా భూమి పొరపాటున ప్రభుత్వ భూమి అని పడితే దాన్ని మార్పు చేయాలంటే సీసీఎల్ఏ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇలాంటి సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉండేవి. ఇప్పుడు వాటితో పాటు అత్యధికంగా ఉన్న సాదాబైనామాలకు కూడా మోక్షం లభించే అవకాశం ఉంది.
భూ భారతితో రైతులకు ఎంతో మేలు
-అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్
భూ భారతి చట్టం రైతులకు ఒక వరం. ధరణిలో పరిష్కారం కాని సమస్యలు భూ భారతి చట్టంలో పరిష్కారం కానున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో పైలట్ మండలంగా ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం మండలాన్ని ఎంపిక చేశారు.
రైతుల సమస్యలకు పరిష్కారం
-సత్యప్రసాద్, కలెక్టర్
రైతులకు సంబంధించి ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు భూ భారతితో పరిష్కారం కానున్నాయి. మండలంలోని ప్రతీ రైతు సమస్యను పరిష్కరించి పట్టాలు అందజేస్తాం. ఈనెల 5వ తేదీ నుంచి గ్రామ సభలు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తాం. వాటిపై గ్రామంలో విచారణ జరిపి సమస్యలను పరిష్కరిస్తాం.
్ఞ
---------------------------------------------------------------------------
సాదాబైనామాల దరఖాస్తులు ఇలా...
-------------------------------------------------------------------------------
బుగ్గారం...166
చిన్నాపూర్...65
గంగాపూర్...33
గోపులాపూర్...78
మద్దునూర్...184
శెకల్లా....91
సిరికొండ...36
సిరివంచకోట...48
వెల్గొండ...114
యశ్వంతరావుపేట...88
-------------------------------------------------------------------------------
మొత్తం...903
-------------------------------------------------------------------------------