jagitiala : ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ అంతంతే...
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:55 AM
జగిత్యాల, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ నామమాత్రంగానే కొనసాగుతోంది. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండడంతో నమోదు చేసుకోవడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు.
-వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ
-నమోదు ప్రక్రియకు ముందుకు రాని కర్షకులు
-జిల్లాలో 34.38 శాతమే పూర్తి
జగిత్యాల, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ నామమాత్రంగానే కొనసాగుతోంది. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండడంతో నమోదు చేసుకోవడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఫార్మర్ రిజిస్ట్రీ ఉద్దేశం నీరు కారుతోంది. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతు వేదిక, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో రైతులకు అందుబాటులో ఉంటూ ఫార్మర్ రిజిస్ట్రీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో రైతులు ఇప్పటి వరకు 34.38 శాతం రిజిస్ట్రీ చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు.
ఫమే 5 నుంచే నమోదు ప్రారంభం...
వ్యవసాయ రంగంలో రైతుల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయడానికి వారి భూమి యాజమాన్యం, పథకాల లభ్యత అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో నమోదు చేసుకున్న రైతులకు ఆధార్కార్డు మాదిరి 11 అంకెలతో కూడిన ఐడీని అందిస్తారు. ఈ ప్రక్రియను మే నెల 5 నుంచి వ్యవసాయ అధికారులు ప్రారంభించారు. ఆ సమయంలో రైతులు ధాన్యం అమ్మకాలు, కొనుగోలు కేంద్రాలకు వెళ్లడం వంటి పనులు మాత్రమే ఉండడంతో చకాచకా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్నారు. అనంతరం వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులు రిజిస్ట్రీ ప్రక్రియపై ఆసక్తి చూపడం లేదు.
ఫపథకాలకు ఐడీ కచ్చితం..
ఫార్మర్ రిజిస్ట్రీలో రైతులకు అందించే ఐడీ కీలకంగా మారనుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ ఐడీతోనే రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు రైతులకు దక్కనున్నాయని అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టనున్న పంటల నమోదు కార్యక్రమంలో ఈ ఐడీని ఉపయోగించనున్నారు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయాధికారులు గ్రామాల్లోని రైతు వేదికలు, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఫార్మర్ రిజిస్ట్రీపై అవగాహన కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఈ ప్రత్యేక రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలని సూచిస్తున్నారు. రైతులు తమ పట్టదారు పాస్బుక్, ఆధార్కార్డు జిరాక్స్లను, మొబైల్ నంబర్ను వ్యవసాయ విస్తరణ అధికారులకు అందించాలని పేర్కొంటున్నారు. పీఎం కిసాన్ నిధి, ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన వంటి పథకాల అమలులో ఐడీ తప్పనిసరిగా అవసరమవుతుందని అధికారులు నొక్కి చెబుతున్నారు. రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఫసాంకేతిక సమస్యలతో ఇబ్బంది...
జిల్లాలో 34.38 శాతం ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు పూర్తయిందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 71 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్కు ఓ వ్యవసాయ విస్తరణ అధికారి విధులు నిర్వహించగా, ఆయా గ్రామాలకు వెళ్లి ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. చాలా చోట్ల సర్వర్లు మొరాయిస్తున్నాయని అధికారులు, రైతులు వాపోతున్నారు. రైతు భరోసా, పంట నమోదు, విత్తనాలు, ఎరువుల సరఫరా తదితర విషయాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు ఇప్పటికే బిజీ ఉండగా, కేంద్ర ప్రభుత్వం అదనంగా ఫార్మర్ రిజిస్ట్రీని తీసుకురావడంతో ఏఈవోలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికి తోడు సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నమోదుతో మేలు..
-భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి
ఫార్మర్ రిజిస్త్రీ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులు బిజీగా మారారు. వారు వీలు చూసుకొని వ్యవసాయ విస్తరణ అధికారులకు పట్టా పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, మొబైల్ నంబర్తో ఫార్మర్ రిజిస్ట్రీ తప్పకుండా చేసుకోవాలి.
-------------------------------------------------------------------------------------------------------------
జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ పరిస్థితి ఇలా...
-------------------------------------------------------------------------------------------------------------
మండలం....పాసు పుస్తకాల సంఖ్య....ఫార్మర్ రిజిస్ట్రీ శాతం
-------------------------------------------------------------------------------------------------------------
మేడిపల్లి - 6,252 - 50.06 శాతం
ఇబ్రహీంపట్నం - 11,240 - 47.16 శాతం
ధర్మపురి - 16,692 - 41.78 శాతం
పెగడపల్లి - 14,659 - 39.70 శాతం
జగిత్యాల రూరల్ - 18,013 - 39.70 శాతం
మేడిపల్లి - 8,964 - 39.35 శాతం
మల్లాపూర్ - 16,108 - 39.17 శాతం
ఎండపల్లి - 10,487 - 38.31 శాతం
రాయికల్ - 15,730 - 6.85 శాతం
బుగ్గారం - 7,287 - 36.00 శాతం
కథలాపూర్ - 13,856 - 32.84 శాతం
బీర్పూర్ - 8,155 - 32.69 శాతం
కొడిమ్యాల - 13,086 - 30.65 శాతం
సారంగపూర్ - 7,807 - 30.59 శాతం
కోరుట్ల - 14,162 - 28.32 శాతం
వెల్గటూరు - 10,452 - 27.74 శాతం
మెట్పల్లి - 17,960 - 25.90 శాతం
మల్యాల - 12,171 - 25.70 శాతం
జగిత్యాల - 5,964 - 24.95 శాతం
గొల్లపల్లి - 17,272 - 24.50 శాతం