Share News

jagitiala : మున్సిపాలిటీల్లో గాడి తప్పుతున్న పాలన

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:37 AM

జగిత్యాల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ల పాలన గాడి తప్పుతోంది.

jagitiala :  మున్సిపాలిటీల్లో గాడి తప్పుతున్న పాలన

- పన్ను వసూళ్లకే వార్డు ఆఫీసర్లు పరిమితం

- సొంత ప్రయోజనాలు కల్పించే పనులపై ఆసక్తి

- సమస్యల పరిష్కారానికి చొరవచూపని వైనం

- పట్టించుకోని అధికారులు

- ఇబ్బందులు పడుతున్న ప్రజలు

జగిత్యాల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ల పాలన గాడి తప్పుతోంది. అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి సమన్వయకర్తలుగా వ్యవహరించాల్సిన వార్డు ఆఫీసర్లు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దిశానిర్దేశం చేయాల్సిన ఉన్నతాధికారులు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో వార్డు ఆఫీసర్లు కేవలం పన్నుల వసూళ్లు, సంక్షేమ పథకాలకే పరిమితమయ్యారు. వార్డు ఆఫీసర్‌ పాలన లక్ష్యం మేరకు జరగడం లేదన్న విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా అయిదు మున్సిపాలిటీల్లో 134 వార్డులుండగా అదేసంఖ్యలో వార్డు ఆఫీసర్లు పనిచేస్తున్నారు. జగిత్యాల లో 48 మంది, కోరుట్లలో 33 మంది, మెట్‌పల్లిలో 26 మంది, ధర్మపురిలో 15 మంది, రాయికల్‌లో 12 మంది వార్డు ఆఫీసర్లు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

- ఒక్కో వార్డుకు ఒక్కో ఆఫీసరు..

వార్డు పరిపాలన బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితం సిబ్బందిని నియమించింది. రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్‌ఏలను పురపాలక శాఖలో విలీనం చేసింది. వీరితో పాటు బల్దియాలోని 134 మంది పర్మనెంట్‌ ఉద్యోగులు, బిల్‌ కలెక్టర్లు, వివిధ విభాగాలకు చెందిన వారిని గుర్తించారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ మున్సిపాలిటీల్లో ప్రతీవార్డుకు వార్డు ఆఫీసర్లను నియమించింది. వీరందరూ వారికి కేటాయించిన వార్డుల్లో వివిధ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.

- కొరవడిన పర్యవేక్షణ...

వార్డు ఆఫీసర్లపై బల్దియా ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 15రోజులు నెలవారీగా మున్సిపల్‌ కమిషనర్లు, మున్సిపల్‌ ప్రత్యేకాధికారి సమీక్షించి సమస్యలపై పరిష్కార మార్గాలు సూచించాలి. కానీ అవేమి అమలు కాకపోవడంతో వార్డు ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వార్డు ఆఫీసర్ల పాలనను గాడిలో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

- ఏం చేయాలి...

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, మున్సిపల్‌ ప్రత్యేకాధికారులు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధుల దృష్టికి రాని అనేక సమస్యలు క్షేత్రస్థాయిలో ఉత్పన్నమవుతుంటాయి. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషిచేయాలి. పౌర సేవల పట్టిక అమలు కోసం పనిచేయాల్సి ఉంటుంది. అధికారుల దృష్టికి వచ్చే ఫిర్యాదులే కాకుండా సామాజిక మధ్యమాలు, కంట్రోల్‌ రూం, టోల్‌ఫ్రీ నంబర్‌ ఫిర్యాదులపై స్పందించాలి. ఆస్తి, నీటి, గ్యారేజ్‌ చార్జీలు, ట్రేడ్‌ లైసెన్స్‌ పన్నులు వసూలు చేయాలి. మరణ ధ్రువపత్రాల జారీకి విచారణ చేయాలి. రోడ్లపై గుంతలు, నీటినిల్వలు, మట్టి కుప్పలు, మూతలేని మ్యాన్‌హోళ్లు, పుట్‌పాత్‌, కబ్జాలు, వెలగని వీధి లైట్లు, ఇంటింట చెత్త సేకరణ తీరు, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ, నాలాలు, డ్రెయినేజీల్లో వ్యర్థాలు పేరుకుపోవడం, దోమల సమస్య, జంతు పక్షుల కళేబరాలు, దివ్యాంగులు, వృద్ధులకు గుర్తింపు కార్డులు తదితర సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలి. అనధికారి భవన నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలు, అక్రమంగా వెలిసిన ఫ్లెక్సీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై విచారణ, పురోగతిపై దృష్టిసారించాలి. ఆయా విభాగాలకు చెందిన ఏఈలు, ఆర్‌ఐలు, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు, డివిజన్ల సిబ్బంది, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేయాలి.

- ఏం చేస్తున్నారు..

వార్డు ఆఫీసర్లు ఆస్తి, నీటి చార్జీలను అరకొరగా వసూలు చేస్తున్నారు. దీనికి కూడా బిల్‌ కలెక్టర్ల సహకారం తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే, పురోగతి, గృహలక్ష్మి, పెన్షన్ల కోసం లబ్ధిదారుల విచారణ చేసి చేతులు దులుపుకుంటున్నారు. వార్డు ఆఫీసర్‌ పాలనకు సంబంధించిన ఇతర పనులపై ఏ మాత్రం చొరవ తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. దీంతో ఆయా వార్డుల్లో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి. ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతూ నామమాత్రంగా విధులు నిర్వర్తిస్తూ కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - Sep 22 , 2025 | 12:37 AM