Share News

ముందుగా ‘పరిషత్‌’ ఎన్నికలేనా?

ABN , Publish Date - Jul 18 , 2025 | 01:13 AM

పల్లె పోరుకు ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది.

ముందుగా ‘పరిషత్‌’ ఎన్నికలేనా?

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పల్లె పోరుకు ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది. ఇప్పటికే 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు సిద్ధమైంది. ఆర్డినెన్స్‌ రావడంతోనే స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఈక్రమంలోనే ముందుగా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ స్థానాల లెక్కలను తేల్చింది. స్థానాలను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లు ఖరారుతోనే ముందుగా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించే సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ఎన్నికల స్థానాలు యథావిధిగా ఉన్నాయి. ఒకవైపు గ్రామపంచాయతీ ఎన్నికలు, పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందులో పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతుండడంతో ముందుగానే పరిషత్‌ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు.

మారనున్న రిజర్వేషన్లు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో జడీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ప్రకటించిన ప్రభుత్వం రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ సంతకం చేయడంతోనే రిజర్వేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. 2019 రిజర్వేషన్లతో పోల్చుకుంటే ఈసారి భారీ మార్పులు కానున్నాయి. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలుచేయాల్సి ఉండడంతో ఆశావహుల్లో కొందరి ఆశలకు రిజర్వేషన్లు బ్రేక్‌ వేసే అవకాశం ఉంది. రిజర్వేషన్లకు సంబంధించి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌లకు రాష్ట్ర యూనిట్‌గా, ఎంపీపీ పదవులకు జిల్లా యూనిట్‌గా, ఎంపీటీసీ, సర్పంచ్‌లకు మండల యూనిట్‌గా, వార్డు సభ్యులకు గ్రామం యూనిట్‌గా రిజర్వేషన్లను కలెక్టర్‌, ఆర్డీవోలు సమక్షంలో జరుగుతుంది. 2019 ఎన్నికల్లో 12 జడ్పీటీసీ స్థానాల్లో ఒకటి ఎస్టీ మహిళ, ఒకటి ఎస్సీ మహిళ, రెండు ఎస్సీ జనరల్‌, ఒకటి బీసీ మహిళ, ఒకటి బీసీ జనరల్‌, మూడు జనరల్‌ మహిళ, మరో మూడు జనరల్‌లకు కేటాయించారు. రిజర్వేషన్ల ప్రకారం ఆరు మహిళలకు, ఆరు జనరల్‌గా ఉన్నాయి. 123 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 68 మహిళలకు, 58 జనరల్‌కు కేటాయించారు. ఇందులో ఎస్టీలకు ఆరు కేటాయించగా 5 మహిళలకు, ఒకటి జనరల్‌గా ఉంది. 28 ఎస్సీలకు కేటాయించగా 17 మహిళలకు, 11 జనరల్‌, 25 బీసీలకు కేటాయించగా 14 మహిళలకు, 11 జనరల్‌ స్థానాలుగా ఉన్నాయి. 64జనరల్‌ స్థానాలు ఉండగా 29 మహిళలకు, 25 జనరల్‌గా కేటాయించారు. ఈసారి రిజర్వేషన్లు మార్పు ఎలా ఉంటుందనే చర్చ కొనసాగుతోంది. జిల్లాలో 12 జడ్పీటీసీలు, 12 ఎంపీపీ, 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టిన అశావహులు మళ్లీ పరిషత్‌ ఎన్నికలపై దృష్టి సారించడంతో పల్లెల్లో సందడి కనిపిస్తోంది.

ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 జడ్పీటీసీలు, 12 ఎంపీపీ, 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. బోయినపల్లి, చందుర్తి, ఇల్లంతకుంట, గంభీరావుపేట, కోనరావుపేట, ముస్తాబాద్‌, రుద్రంగి, తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్‌, వేములవాడ అర్బన్‌, ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాల్లో బోయినపల్లి మండలంలో 11 స్థానాలు, చందుర్తిలో 10, ఇల్లంతకుంటలో 14, గంభీరావుపేటలో 13, కోనరావుపేటలో 12, ముస్తాబాద్‌లో 13, రుద్రంగిలో 5, తంగళ్లపల్లిలో 14, వీర్నపల్లిలో 5, వేములవాడ రూరల్‌లో 7, వేములవాడ అర్భన్‌లో 6, ఎల్లారెడ్డిపేటలో 13 స్థానాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది నియామకాలకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 709 పోలింగ్‌ కేంద్రాలు, 3700 మంది పోలింగ్‌ సిబ్బందిని ఇప్పటికే గుర్తించారు.

పరిషత్‌ ఓటర్లు 3,53,796 మంది..

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల లెక్క కూడా తేల్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,53,796 ఓటర్ల జాబితాను ఇప్పటికే ఎన్నికల సంఘానికి పంపించారు. ఓటర్లలో 1,71,174 మంది పురుషులు, 1,82,602 మంది మహిళలు ఉన్నారు. 20 మంది జెండర్‌లు ఉన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటర్లలో మహిళలే అధికంగా ఉన్నారు. పురుషుల కంటే 11,428 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితాను కేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటర్లు..

మండలం పురుషులు మహిళలు మొత్తం

బోయినపల్లి 15,001 16,019 31,020

చందుర్తి 13,444 14,651 28,095

ఇల్లంతకుంట 19,775 20,977 40,752

గంభీరావుపేట 17,889 19,061 36,951(జెండర్‌ 1)

కోనరావుపేట 17,174 18,057 35,231

ముస్తాబాద్‌ 18,833 19,984 38,817

రుద్రంగి 6,435 7,176 13,614(జెండర్‌ 3)

తంగళ్లపల్లి 18,809 19,891 38,700

వీర్నపల్లి 5,911 6,063 11,974

వేములవాడ అర్బన్‌ 9,099 9,623 18,738(జెండర్‌ 16)

వేములవాడ రూరల్‌ 9,119 9,918 19,017

ఎల్లారెడ్డిపేట 19,705 21,182 40,887

------------------------------------------------------------------------------------------------------

మొత్తం 1,71,174 1,82,602 3,53,796(జెండర్‌ 20)

-------------------------------------------------------------------------------------------------------

Updated Date - Jul 18 , 2025 | 01:13 AM