ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలి
ABN , Publish Date - May 03 , 2025 | 12:39 AM
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
- నీట్ పకడ్బందీగా నిర్వహించాలి
- రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కరీంనగర్, మే 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో కలిసి భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక ఎంతవరకు పూర్తయితే అంతవరకు ఏరోజుకారోజు ఇన్చార్జి మంత్రుల నుంచి లబ్ధిదారుల జాబితాకు ఆమోదం తీసుకోవాలని, అలాగే ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో కనీసం 500 ఇళ్లు కేటాయించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం జరిగేలా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనర్హులని తేలితే నిర్మాణం మధ్యలో ఉన్నా రద్దు చేస్తామన్నారు. లిస్టు-1, లిస్టు-2, లిస్టు-3లతో సంబంధం లేకుండా నిరుపేదలను ఎంపిక చేయాలన్నారు. గత నెల 17 నుంచి 30 వరకు నాలుగు మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు జిల్లాకొక మండలం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. పైలెట్ మండలాల్లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 31వ తేదీ వరకు పరిష్కరించాలని, పరిష్కారం కాని వాటికి ఎందుకు పరిష్కరించడం లేదనే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తూ, దరఖాస్తును తిరస్కరించాలని కలెక్టర్లకు సూచించారు. 605 మండలాలకు ఇప్పటివరకు 590 మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహించడం జరిగిందని, ఇందులో 85,527 మంది పౌరులు, 1,62,577 మంది రైతులు పాల్గొన్నారని తెలిపారు. ఈ నెల 4న జరగనున్న నీట్ పరీక్షకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ అన్ని మండలాల్లో భూ భారతి కొత్త ఆర్వోఆర్ చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. 10,568 ఇందిరమ్మ దరఖాస్తులకు సంబంధించి విచారణ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నామని, పేదలలో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ఈ నెల 4న జరిగే నీట్ పరీక్షల కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని, మొత్తం 7 పరీక్ష కేంద్రాల్లో 2,975 మంది నీట్ పరీక్ష రాస్తున్నట్లు వివరించారు. ఈ కాన్ఫరెన్స్లో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మికిరణ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.