భారత సైనికుల ధైర్య సాహసాలను కళ్లారా చూశాను..
ABN , Publish Date - May 20 , 2025 | 12:06 AM
ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కంట్రోల్ రూం బాధ్యతలు నిర్వర్తిస్తూ భారత సైనికుల ధైర్యసాహసాలను కళ్లారా చూశానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
- ఈ సమయంలో కేంద్ర కేబినెట్లో ఉండడం నా అదృష్టం
- తిరంగా ర్యాలీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
గణేశ్నగర్, మే 19 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కంట్రోల్ రూం బాధ్యతలు నిర్వర్తిస్తూ భారత సైనికుల ధైర్యసాహసాలను కళ్లారా చూశానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో నరేంద్రమోదీ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగడం తన అదృష్టమని ఆయన అన్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ నుంచి రాంనగర్ వరకు బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్దానికి విరామం ఇచ్చామే తప్ప ముగియలేదని, దేశానికి ఆపదొస్తే టెర్రరిస్టుల అంతు చూసే వరకు విడిచి పెట్టబోమని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్తో మన సైన్యం సత్తా యావత్ ప్రపంచానికి తెలిసిందన్నారు. పాకిస్థాన్ ప్రజల ప్రాణాలకు నష్టం లేకుండా ఉగ్రవాద శిబిరాలను ముట్టుపెట్టిన ఘనత మన సైనికులదేనని కొనియాడారు. ప్రధాన మోదీ నాయకత్వ పటిమను ప్రపంచమంతా మెచ్చుకుంటోందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో మన సైనికుల ధైర్యసాహసాలను గుర్తు చేస్తూ తిరంగా యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం హిందూ ఏక్తా యాత్ర పాటలు విడుదల చేశారు.
’