ఆశలు గల్లంతు
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:15 AM
పెద్దపల్లి జిల్లా దాని చుట్టుపక్కల గల జిల్లాల ప్రజలకు విమానాశ్రయం ఆశలు గల్లంతయ్యాయి. బసంత్ నగర్ మినీ ఎయిర్ పోర్టును రామగుండం ఎయిర్పోర్టుగా ఏర్పాటు చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గత ఏడాది నవంబర్ 27న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
పెద్దపల్లి జిల్లా దాని చుట్టుపక్కల గల జిల్లాల ప్రజలకు విమానాశ్రయం ఆశలు గల్లంతయ్యాయి. బసంత్ నగర్ మినీ ఎయిర్ పోర్టును రామగుండం ఎయిర్పోర్టుగా ఏర్పాటు చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గత ఏడాది నవంబర్ 27న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే. లేఖను పరిశీలించిన మంత్రి బసంత్నగర్ మినీ ఎయిర్పోర్టును విమానాశ్రయంగా ఏర్పాటుకు అవకాశం లేదని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిందని ఎంపీకి ఈ ఏడాది జనవరి 29వ తేదీన పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఎత్తైన గుట్టలు ఉండడంతోపాటు రామగుండం ప్రాంతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిధిలో ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎయిర్ఫోర్స్ అకాడమీ ఫ్లయింగ్ శిక్షణ కూడా రామగుండం ప్రాంతంలోని గగనతలంలో జరుగుతున్నదని పేర్కొన్నారు. ఒకవేళ ఇక్కడ ఎయిర్పోర్టును ఏర్పాటు చేయాల్సి వస్తే కేంద్ర రక్షణ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. 2008 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు పాలసీ ప్రకారం దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఎయిర్పోర్టుల నిర్మాణానికి అనుకూలంగా ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని పేర్కొన్నారు.
ఫ బసంత్నగర్లో ఇదివరకే మినీ ఎయిర్ పోర్టు
బసంత్నగర్లో యాభై ఏళ్ళ క్రితం మినీ ఎయిర్పోర్ట్ నిర్మించారు. బసంత్నగర్లో బిర్లా కేశోరామ్ సంస్థ సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మించింది. అయితే ఈ ఫ్యాక్టరీని పరిశీలించేందుకు బిర్లా వచ్చేందుకు వీలుగా సుమారు 400 ఎకరాల్లో మినీ ఎయిర్ పోర్టును కేశోరామ్ సంస్థ సొంతంగా నిర్మించింది. ఈ ఎయిర్పోర్టులో ఇతర మినీ విమానాలకు అవకాశం లేదు. కాలక్రమేణా ఈ ఎయిర్పోర్ట్ ఉపయోగంలో లేకుండా పోయింది. తెలంగాణ ప్రాంతంలో కేవలం హైదరాబాదులో మాత్రమే విమానాశ్రయం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్తోపాటు వరంగల్ జిల్లా మాములూరు, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, రామగుండం ప్రాంతంలోని బసంత్నగర్, మరో మూడు చోట్ల ఎయిర్పోర్టులను ఏర్పాటు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. అప్పటికే కేంద్ర ప్రభుత్వం సైతం దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలకు తోడుగా మరో 150 విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిపుణులు ఆయా ప్రభుత్వాలు ప్రతిపాదించిన స్థలాలను పరిశీలించాయి. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బసంత్నగర్ మినీ ఎయిర్ పోర్టును కూడా ప్రతిపాదించింది. 2017లో అప్పటి జిల్లా కలెక్టర్ ప్రస్తుతం ఉన్న మినీ ఎయిర్పోర్ట్ స్థలంతోపాటు మరో 600 ఎకరాలు అవసరం ఉంటాయని గుర్తించింది. ఇందులో కొంత అటవీ శాఖకు సంబంధించిన భూమితోపాటు ప్రభుత్వ భూమి కూడా ఉంది. అలాగే కుర్మపల్లి గ్రామంలో కొంత పట్టా భూమిని సేకరించాల్సి ఉంటుందని సర్వే ద్వారా అధికారులు తేల్చారు. అవసరమైన భూమిని ఎయిర్ పోర్టు నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చేందుకు తాము అనుకూలంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఫ బసంత్నగర్ను సందర్శించిన ఏఏఐ బృందం
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనల మేరకు కేంద్రం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిపుణుల బృందం 2018లో, 2019లో బసంత్నగర్ను సందర్శించింది. పాత మినీ ఎయిర్పోర్టు స్థలంతో పాటుగా, చుట్టుపక్కల గుర్తించిన స్థలాన్ని కూడా వారు పరిశీలించారు. ఈ ఎయిర్ పోర్టుకు సమీపంలోనే ఎత్తైన గుట్టలు ఉండడంతోపాటు, విద్యుత్ టవర్లు ఉన్నాయని ఎయిర్ పోర్టు ఏర్పాటుకు అనువైనది కాదని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిపుణుల బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటు సమావేశాల్లో గతంలో ప్రకటించింది.
ఫ మరోసారి విన్నవించిన ఎంపీ..
బసంత్నగర్, రామగుండం ప్రాంతంలో గాని విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి మరోసారి విన్నవించారు. దీంతో స్పందించిన ఆయన విమానయాల స్థల ప్రతిపాదనను పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారని ఎంపీ గడ్డ వంశీకృష్ణ పేర్కొన్నారు.