రూ.76 లక్షల విలువైన గుట్కా పట్టివేత
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:12 AM
కొంత కాలంగా ఒక ముఠా కరీంనగర్, గోదావరిఖని ప్రాంతాలకు మహారాష్ట్రలోని బీదర్ నుంచి నిషేధిత గుట్కాను తరలిస్తోంది. గట్టుచప్పుడు కాకుండా స్థానికంగా వ్యాపారులకు సరఫరా చేస్తోంది.
కరీంనగర్ క్రైం, జూలై 23(ఆంధ్రజ్యోతి): కొంత కాలంగా ఒక ముఠా కరీంనగర్, గోదావరిఖని ప్రాంతాలకు మహారాష్ట్రలోని బీదర్ నుంచి నిషేధిత గుట్కాను తరలిస్తోంది. గట్టుచప్పుడు కాకుండా స్థానికంగా వ్యాపారులకు సరఫరా చేస్తోంది. దీనిపై నిఘా పెట్టిన కరీంనగర్ టాస్క్ఫోర్స్, వన్ టౌన్ పోలీసులు రూ.76లక్షల విలువైన గుట్కాతోపాటు 11 మందిని పకడ్బంధీగా పట్టుకున్నారు. వన్ టౌన్ సీఐ బిల్ల కోటేశ్వర్ వివరాల ప్రకారం.... కరీంనగర్ తీగల వంతెన వద్ద పోలీసులు బుధవారం ఉదయం డీసీఎం వ్యాన్, అశోక్లేలాండ్ మినీ ట్రక్లను సోదా చేశారు. మహారాష్ట్రలోని బీదర్ నుంచి కరీంనగర్కు రవాణా అవుతున్న నిషేధిత గుట్కాను, ముఠాను పట్టుకున్నారు. ముఠాకు చెందిన వారిలో గోదావరిఖనికి చెందిన నలుగురు, కరీంనగర్కు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. రెండు వాహనాలతోపాటు 304 బ్యాగ్లలో ఉన్న 7 లక్షల 60 వేల గుట్కా పాకెట్లను సీజ్ చేశారు. నిందితుల వద్ద నుంచి 13 లక్షల 17 వేల 850 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 13 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.