ముగిసిన ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Jun 01 , 2025 | 01:07 AM
యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా వరిధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన 325 కేంద్రాలను మూసేశారు. ఈ సీజన్లో 51,965 మంది రైతుల నుంచి 716.12 కోట్ల రూపాయల విలువ చేసే 3,08,683 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటికే 50,441 మంది రైతుల ఖాతాల్లో 695.07 కోట్ల రూపాయలు జమ చేశారు. మరో 1,524 మంది రైతులకు 21.5 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది.
- కొనుగోలు చేసింది 3,08,683 మెట్రిక్ టన్నులు
- ధాన్యం విలువ రూ. 716.12 కోట్లు
- రైతులకు చెల్లించింది రూ. 695 కోట్లు
- అన్ని కొనుగోలు కేంద్రాల మూసివేత
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా వరిధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన 325 కేంద్రాలను మూసేశారు. ఈ సీజన్లో 51,965 మంది రైతుల నుంచి 716.12 కోట్ల రూపాయల విలువ చేసే 3,08,683 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటికే 50,441 మంది రైతుల ఖాతాల్లో 695.07 కోట్ల రూపాయలు జమ చేశారు. మరో 1,524 మంది రైతులకు 21.5 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతుందని అధికారులు తెలిపారు. జిల్లాలో ఈ సీజన్లో 2,66,896 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ విస్తీర్ణం నుంచి 5,86,723 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు.మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తుందని అంచనా వేసిన జిల్లా యంత్రాంగం జిల్లావ్యాప్తంగా 325 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. 45 రోజులపాటు అన్ని గ్రామాల్లో ధాన్యం సేకరణ నిర్వహించి 3,08,683 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 2,75,989 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం, 32,694 మెట్రిక్ టన్నులు సన్నరకం ధాన్యం ఉన్నాయి.
- జిల్లావ్యాప్తంగా 182 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 439.74 కోట్ల విలువ చేసే 1,89,551 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
- 101 ఐకేపీ కేంద్రాల ద్వారా 165.07 కోట్ల విలువచేసే 71,151 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు.
- 38 డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా 98.72 కోట్ల విలువచేసే 42,551 మెట్రిక్ టన్నుల ధాన్యం, నాలుగు హాకా కేంద్రాల ద్వారా 12.59 కోట్ల రూపాయల విలువచేసే 5,428 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
ఫ ప్రథమ స్థానంలో సహకార సంఘాలు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు క్రియాశీలక పాత్ర వహించి ఎక్కువ కొనుగోళ్లు చేశాయి. ఐకేపీ మహిళా కేంద్రాలు ద్వితీయ స్థానంలో నిలిచాయి. నైరుతి రుతుపవనాలు ఈసారి 15 రోజులు ముందస్తుగానే రోహిణి కార్తెలోనే వచ్చినా జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తవడంతో ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వలేదు. చివరి రెండు, మూడు రోజుల్లో ఉపరితల ద్రోణి కారణంగా అకాల వర్షాలు కురిసి కొద్దిపాటి ధాన్యం తడిసినా వాటిని కొనుగోలు చేశారు. దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే వరిధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి.