మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం
ABN , Publish Date - May 19 , 2025 | 12:30 AM
మద్యం ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ ఆదివారం సర్క్యులర్ను జారీ చేసింది. విస్కీ, బ్రాంది, రమ్ వంటి మద్యం ధరలను మాత్రమే పెంచింది. బీరు, బ్రీజర్ ధరలను యథాతథంగా ఉంచుతూ ఎక్సైజ్శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. విస్కీ ఫుల్ బాటిల్పై 40, హాఫ్పై 20, క్వార్టర్ బాటిల్పై 10 రూపాయలు పెంచారు.
కరీంనగర్ క్రైం, మే 18 (ఆంధ్రజ్యోతి): మద్యం ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ ఆదివారం సర్క్యులర్ను జారీ చేసింది. విస్కీ, బ్రాంది, రమ్ వంటి మద్యం ధరలను మాత్రమే పెంచింది. బీరు, బ్రీజర్ ధరలను యథాతథంగా ఉంచుతూ ఎక్సైజ్శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. విస్కీ ఫుల్ బాటిల్పై 40, హాఫ్పై 20, క్వార్టర్ బాటిల్పై 10 రూపాయలు పెంచారు. ఈ పెంచిన ధరలను మద్యం షాపులకు ఆదివారం పంపించడంతో కొందరు మద్యం వ్యాపారులు ఆదివారం నుంచే పెంచిన ధరలను అమలు చేస్తున్నారు. బీరు ధరలను ప్రభుత్వం ఫిబ్రవరి నెలలోనే పెంచడంతో వాటి ధరలపెంపు జోలికి ప్రభుత్వం పోలేదు. పెంచిన ధరలను ప్రభుత్వం స్పెషల్ ఎక్సైజ్ సెస్గా పేర్కొన్నట్లుగా తెలిసింది. పెంచిన ధరల్లో వ్యాపారులకు ఎలాంటి మార్జిన్ రాకుండా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇదివరకు మద్యం ధరలను బ్రాండ్ల వారీగా పెంచేవారు. ప్రస్తుతం స్పెషల్ ఎక్సైజ్ సెస్ రూపంలో పెంచటంతో అన్ని రకాల విస్కీలకు ఒకే విధంగా ధరలను పెంచారు. ధరల పెంపుతో మద్యం ప్రియులపై అదనపు భారం పడనుంది. జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10,20,439 పెట్టెల విస్కీ అమ్మకాలు జరిగాయి. ఒక్కో పెట్టెలో 12 ఫుల్బాటిళ్లు లేదా 24 హాఫ్ బాటిళ్లు లేదా 48 క్వార్టర్ బాటిళ్లు ఉంటాయి. లెక్కన ఒక్కో పెట్టెకు 480 రూపాయలు ధర పెరుగుతుంది. పెంచిన ధరలతో ప్రభుత్వానికి 49 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది. ఇది మద్యం ప్రియులకు భారంగా మారనుంది.