కొండెక్కిన బంగారం
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:57 AM
: దసరా, దీపావళి పండుగలకు ముందే పసిడి పరుగులు పెడుతోంది. రికార్డుస్థాయిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,900కు చేరడంతో ధరలను చూసి జనం ఆశ్చర్యానికి గురవుతున్నారు.
- 10 గ్రాములకు రూ.1,19,900
- పండుగ వేల పసిడి పరుగులు
కరీంనగర్ టౌన్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): దసరా, దీపావళి పండుగలకు ముందే పసిడి పరుగులు పెడుతోంది. రికార్డుస్థాయిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,900కు చేరడంతో ధరలను చూసి జనం ఆశ్చర్యానికి గురవుతున్నారు. గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు మాసంలో 10 గ్రాముల బంగారం ధర 80,000 నుంచి రోజురోజుకు కొద్దికొద్దిగా పెరుగడం, తగ్గడంతో లక్షకు చేరువైంది. గత నెలరోజులుగా లక్ష రూపాయలకు చేరుకొని రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. 10 గ్రాముల ధర లక్ష రూపాయల వద్ద నిలకడగా ఉంటుందని వ్యాపా రులు, ప్రజలు భావించారు. అయితే గత కొన్ని రోజులుగా 10 గ్రాముల ధర వందల నుంచి వేలల్లోనే పెరుగుతూ వస్తోంది. శనివారం కరీంనగర్ పట్టణ గోల్డ్, సిల్వర్, అండ్ జువెల్లరీ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉదయం 11 గంటలకు విడుదల చేసిన మొదటి చీటీలో 10 గ్రాముల ధర రూ.1,18,500 ఉంది. మధ్యాహ్నం 2.30 గంటలకు రెండవ చీటిలో ధర పెరిగినట్లు పేర్కొంటే 1,19,300లుగా నిర్ణయించింది. మరో రెండు గంటల తర్వాత సాయంత్రం 4.30 గంట లకు జారీచేసిన ధర మూడవ చీటిలో 1,19,900గా పేర్కొంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 1,18,500 రూపాయల ధర పలికి బంగారం ఆ తర్వాత 10 గ్రామాలకు 800 పెరుగగా, సాయం త్రం 4.30 గంటల వరకు 1400 పెరుగడంతో రికార్డుస్థాయికి లక్షా 19,900కు చేరుకుంది. గంటల వ్యవధిలోనే వందల రూపాయలు పెరుగుతూ ఒకే రోజు 1400 పెరుగడం ఇటు వ్యాపారులను కొంత విస్మయానికి గురి చేసింది. లక్ష రూపాయల మార్కుకు బంగారం ధర చేరుకోవడంతో సగానికిపైగా అమ్మకాలు తగ్గాయని విక్రయదారులు ఆందోళన చెందుతున్నారు. గంటల వ్యవధిలో భారీగా పెరిగి 1,20,000 మార్కు చేరడంతో వ్యాపారాలు పూర్తిగా తగ్గే అవకాశా లుంటాయని చెబుతున్నారు. మరోవైపు కార్పొరేట్ గోల్డ్ అండ్ సిల్వర్ జూవెల్లరీ షాపులతో స్థానిక వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడింది. కనీసం దసరా, దీపావళి పండుగలతో పాటు అక్టోబర్, నవంబర్ మాసంలో జరిగే పెళ్ళిళ్ల కోసమైనా బంగారు నగలు చేయిస్తారని ఆశించిన వ్యాపారులు ఇప్పుడు ఆశలు అడియాశలైనట్లేనని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు పేద, మధ్యతరగతి కుటుంబాల వారు ఎంతో కొంతైనా బంగారం కొనడం కూడా కష్టమేనని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ మేరకు బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ధరలు మరింత పెరుగుతాయో లేక ఇక్కడే ఆగిపోతాయో తెలియడం లేదని, ధరల పెరుగుదలతో తమ వ్యాపారాలు పూర్తిగా తగ్గాయని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కనీసం దుకాణాల నిర్వహణ ఖర్చులు కూడా కష్టంగా మారాయం టున్నారు. బంగారు నగలు చేసేవారికి పూర్తిగా ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన చెందు తున్నారు. ఇప్పటికే ఓవైపు 1 గ్రామ్ గోల్డ్ జూవెల్లరీస్, మరోవైపు కార్పొరేట్ జూవెల్లరీస్ సంస్థలు, ఆన్లైన్ ట్రేడింగ్, ఇప్పుడు ధరల పెరుగుదలతో బంగారు నగల తయారీ, అమ్మకాలు చేయడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.