యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు..
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:01 AM
పంటలు సాగు చేసి నెల రోజులు గడుస్తున్నా.. సకాలంలో యూరియా చల్లక పైరు ఎదగడం లేదు.. అంటూ ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల కేంద్రాల్లో రైతులు గురువారం ఆందోళన చేపట్టారు.
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి, సెప్టెంబరు4(ఆంధ్రజ్యోతి): పంటలు సాగు చేసి నెల రోజులు గడుస్తున్నా.. సకాలంలో యూరియా చల్లక పైరు ఎదగడం లేదు.. ఎరువు కోసం పనులు వదులుకుని కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్నాం.. దండం పెడుతాం.. యూరియా అందించండీ.. లేదంటే దిగిపొండి.. అంటూ ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల కేంద్రాల్లో రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. ఎల్లారెడ్డిపేట గ్రామ శివారులోని ప్యాక్స్ ఆధ్వర్యంలోని గోదాం వద్ద యూరియాకు బారులు తీరారు. ముందుగా టోకెన్లను జారీ చేస్తామని సిబ్బంది పేర్కొన్నారు. దాంతో రైతులు గంటల తరబడి పడిగాపులు కాచారు. వీర్నపల్లి మండల కేంద్రంలో 220 యూరియా బస్తాలు రావడంతో తమకు పూర్తి స్థాయిలో అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నా, రాస్తారోకో చేపట్టారు. గత పది రోజులుగా ఎరువు కోసం ఎదురు చూస్తున్న తమకు సరి పడవని వాపోయారు. రైతులకు పూర్తి స్థాయిలో అందించకుండా ఇబ్బందుకు గురి చేస్తోందని మండి పడ్డారు. సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకండా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని శాంతింపజేయడానికి యత్నించారు. పోలీసులు, రైతులు, నాయకుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ముక్తర్పాషా, ఏఎంసీ చైర్మన్ రాములునాయక్లు రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించేలా చూస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో నాయకులు అరుణ్కుమార్, శ్రీరాంనాయక్, రఫీ, శేఖర్, సంజీవ్, రాములు, రైతులు పాల్గొన్నారు.
కోనరావుపేట : యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడు తూ గురువారం రోడ్డుపై బైఠా యించి నిరసన వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామ శివారులో మరిమడ్ల రైతులు రైతులకు సరిపడా యూరియా అం దజేయాలని కోరుతూ రోడ్డుపై బైఠా యించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా దొరకక ఇబ్బందు లు పడుతున్నామని అన్నారు. యూరియా కావాల్సిన రైతులు ప్రభుత్వం స్పందించి అందజేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.