Share News

ఖర్చుల గుబులు

ABN , Publish Date - Nov 29 , 2025 | 01:18 AM

గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి దావతలు, మందు పార్టీల కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఆశావహులు ఖర్చు చేస్తున్నప్పటికీ వారికి డబ్బుల టెన్షన పట్టుకుంది. మూడు విడతల్లో సర్పంచ ఎన్నికలు జరుగనున్నాయి.

ఖర్చుల గుబులు

- గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి

- దావతలు, మందు పార్టీల జోరు

- చివరి విడత ఆశావహులకు తలకుమించిన భారం

- జిల్లాలో 385 పంచాయతీలు.. 3,536 వార్డులకు ఎన్నికలు

జగిత్యాల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి దావతలు, మందు పార్టీల కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఆశావహులు ఖర్చు చేస్తున్నప్పటికీ వారికి డబ్బుల టెన్షన పట్టుకుంది. మూడు విడతల్లో సర్పంచ ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడత ఎన్నికల అభ్యర్థులకు ఖర్చులు కలిసి వచ్చే అంశం కాగా చివరి విడత వారు అదనంగా భారం మోయాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి నుంచి 20 రోజుల పాటు ఎన్నికల ప్రచారంతో పాటు క్యాడర్‌ను కాపాడుకునేందుకు వారి కోరికలు తీర్చడం లాంటి ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ఓటర్లను ప్రభావితం చేసే పెద్దలను, కుల, మహిళా సంఘాలు, యూత లీడర్లను మచ్చిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చుల అంచనా లెక్కలు చూసి ఆశావహులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంత ఖర్చయినా మంచిదే అంటూ డబ్బులు దారబోస్తే గెలువకపోతే ఎలా అనే భయం మరో వైపు కనబడుతోంది. గెలుపు గుర్రాలపై ప్రధాన పార్టీలు ఆరా తీయడంతో పాటు డబ్బులు ఖర్చు చేసే వారిని సంప్రదిస్తున్నారు. నెలన్నర క్రితం విడుదల అయిన స్థానిక ఎన్నికల నోటిఫికేషనతో కూడా కొంత మంది ఆశావహులు డబ్బులు ఖర్చుచేసి రద్దు కావడంతో చేసేదేమీ లేక క్యాడర్‌ను కాపాడుతున్నారు.

6.07 లక్షల మంది ఓటర్లు..

జిల్లాలో 20 మండలాల్లో 385 గ్రామ పంచాయతీలు, 3,536 వార్డులు ఉన్నాయి. మొత్తం 6,07,263 మంది ఓటర్లు ఉన్నారు. ఒకటో విడత డిసెంబరు 11న కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, వేములవాడ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో జరుగుతాయి. రెండో విడత జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, చొప్పదండి నియోజకవర్గంలోని రెండు మండలాల్లో, మూడో విడత ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జరగనున్నాయి. ఈనెల 27వ తేదీ నుంచి మొదటి విడత నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఆశావహుకులు ఖర్చులు కూడా మొదలు పెట్టారు.

మూడో విడత డబుల్‌ ఖర్చులు...

మూడో విడత ఎన్నికలు ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి, వెల్గటూరు, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో జరుగనున్నాయి. మూడో విడతలో ఉన్న మండలాల జీపీల్లో ఆశావహులు ఇప్పటి నుంచి 20 రోజులకు పైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మొదటి విడత వారితో పోల్చుకుంటే వారి ఖర్చులు రెట్టింపు కానున్నాయని ఆశావహులు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే కొంత మంది పోటీలో ఉన్నామని బయటపడగా మరికొంత మంది ఖర్చులకు భయపడి బయటకు రావడం లేదు. ఇప్పటికే ఆశవహులు యూత లీడర్లు, వార్డు లీడర్లకు పార్టీలకు అతీతంగా దావతలు, పార్టీల్లో ముంచుతు న్నారు. దీంతో ఖర్చులు తడిపిమోపడవుతున్నాయని తలలు పట్టుకుంటున్నారు.

పరిమితికి మించి....

స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చులకు ఎన్నికల కమిషన వ్యయపరిమితి విధించింది. ఐదువేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో రూ. 2.50 లక్షలు, వార్డు సభ్యుడికి రూ. 50 వేలు, ఐదు వేల కంటే తక్కువ జనాభా ఉన్న జీపీల్లో సర్పంచులు రూ. 1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ. 30 వేలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో ఖర్చులన్నింటిని ఆధారలతో సహా ఈసీకి సమర్పించాలి. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై ఆధికారుల నిఘా ప్రతినిత్యం ఉంటుంది. ఎన్నికల వ్యయానికి ఈసీ విధించిన పరిమితులకు మించి ఎనిమిది నుంచి పది రేట్ల వరకు ఖర్చులు ఉంటాయనేది బహిరంగ రహస్యమే అంటున్నారు.

రిజర్వేషన...స్థానాన్ని బట్టి ఖర్చులు

గ్రామపంచాయతీ రిజర్వేషన్లను బట్టి ఎన్నికల ఖర్చులు మారనున్నాయి. జనరల్‌, బీసీ స్థానాల్లో ఖర్చు ఎక్కువ ఉండనుండగా, ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఒకింత తక్కువ ఖర్చు ఉండనుంది. ఈసారి జనరల్‌ స్థానాలే ఎక్కువ ఉండటంతో ఆర్థికంగా బలంగా ఉన్నవారు పోటీ పడేందుకు సిద్ధపడుతున్నా రు. ఇప్పటికే పదవులు చేపట్టిన వారితో పాటు కొత్తవారు సైతం పోటీకి సై అంటున్నారు. గత ఎన్నికల్లోనే సర్పంచులుగా గెలిచేందుకు రూ. లక్షల్లో ఖర్చు చేయగా మళ్లీ ఈ ఎన్నికల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Nov 29 , 2025 | 01:18 AM