Share News

జీపీవోల నియామకానికి కసరత్తు

ABN , Publish Date - May 10 , 2025 | 12:42 AM

గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిషారం కోసం గ్రామానికి ఒక పాలనాధికారి (జీపీవో)ను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌వో) గ్రామ రెవెన్యూ అసిస్టెంట్‌ (వీఆర్‌ఏ)గా పనిచేసిన వారిలో ఆసక్తి ఉన్న వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది.

జీపీవోల నియామకానికి కసరత్తు

- వచ్చే నెల నుంచి భూభారతి చట్టం అమల్లోకి..

- పూర్వ వీఆర్‌వో, వీఆర్‌ఏల నుంచి దరఖాస్తుల స్వీకరణ

- రెవెన్యూ సమస్యల పరిష్కారానికి గ్రామానికో అధికారి

- 110 దరఖాస్తుల రాక, స్ర్కీనింగ్‌ టెస్టు ద్వారా ఎంపిక

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిషారం కోసం గ్రామానికి ఒక పాలనాధికారి (జీపీవో)ను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌వో) గ్రామ రెవెన్యూ అసిస్టెంట్‌ (వీఆర్‌ఏ)గా పనిచేసిన వారిలో ఆసక్తి ఉన్న వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. వీఆర్‌వోల నుంచి 39 మంది, వీఆర్‌ఏల నుంచి 71 మంది, మొత్తం 110 మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే వారంలో వీరికి స్ర్కీనింగ్‌ పరీక్ష నిర్వహించి ఎంపిక చేసి నియామకపత్రాలను అందజేయనున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2015లో రెవెన్యూ చట్టంలో మార్పులు, చేర్పులు చేసేందుకు భూ ప్రక్షాళన చేపట్టిన విషయం తెలిసిందే. పాత పట్టాదారు పాసు పుస్తకాల స్థానంలో హైసెక్యూరిటీ పాసు పుస్తకాలను ప్రభుత్వం జారీ చేసింది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా చాలా వకు తప్పిదాలు జరిగాయి. పట్టాదారుల పేర్లు, సర్వే నంబర్లు తప్పుగా రావడం, విస్తీర్ణం ఎక్కువ, తక్కువ చూపడం, తదితర తప్పులు దొర్లాయి. అవే తప్పులతో భూముల వివరాలన్నింటికీ కంప్యూటరైజ్డ్‌ చేశారు. తప్పొప్పుల సవరణకు అవకాశం ఇవ్వకుండానే ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకు వచ్చింది. భూముల వివరాలను పోర్టల్‌లో పెట్టింది. ఆ వివరాలను ఎవరైనా చూసుకునే వీలు కల్పించింది. పహాణి పుస్తకాల్లో అనుభవదారు పేరు, కబ్జా కాలాన్ని తొలగించింది. తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వెంటనే ముటేషన్‌ పూర్తి చేసి వారం, పది రోజుల్లో పట్టాదారు పాసు పుస్తకం ఇంటికి వచ్చేలా చేశారు. భూముల రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని తీసుకువచ్చారు. ధరణి పోర్టల్‌లో పట్టాదారులుగా ఉన్న వారు మాత్రమే భూములను విక్రయించుకునే అవకాశం కల్పించారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ఆన్‌లైన్‌లో ఒకరికి బదులు మరొకరి పేరు వచ్చినప్పుడు, సదరు వ్యక్తి భూమిని విక్రయించి రిజిస్ట్రేషన్‌ ఈజీగా చేసుకునే వీలు కల్పించారు. ఈ భూమి తనది కాదని, రికార్డుల్లో పేరు తప్పుగా పడిందని, మోఖా మీద మేమే ఉన్నామని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను నిలిపివేయాలని తహసీల్దార్‌కు విన్నవించినా కూడా నిలిపివేసే అవకాశం లేకుండా పోయింది. ధరణి పోర్టల్‌కు భద్రత లేదు. తప్పొప్పుల సవరణ కోసంకలెక్టర్‌, తహసీల్దార్ల చుట్టూ తిరుగుతున్నా నేటికి కూడా పరిష్కారం కావడం లేదు. రెవెన్యూ కోర్టులను ఎత్తివేయడంతో పాటు వీఆర్‌వో, వీఆర్‌ఏ వ్యవస్థలను కూడా అప్పటి ప్రభుత్వం ఎత్తి వేసింది. ధరణి పోర్టల్‌ 2020 అక్టోబరు నెల నుంచి అందుబాటులోకి వచ్చింది. వీఆర్‌వో, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత వారిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు రెండు, మూడేళ్లు పట్టింది. వీఆర్‌వోలను సర్దుబాటు చేసే వరకు వారంతా ప్రతీ రోజు తహసీల్దార్‌ కార్యాలయాలకు వచ్చి హాజరు వేసుకుని వెళ్లారు. 2022లో జిల్లాలో 117 మంది వీఆర్‌వోలను వారి విద్యార్హతలను బట్టి మున్సిపల్‌, నీటి పారుదల శాఖ, తదితర శాఖల్లో సర్దుబాటు చేశారు. అలాగే 2023 ఆగస్టులో 407 మంది వీఆర్‌ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేశారు. వారి విద్యార్హతలను బట్టి జూనియర్‌ అసిస్టెంట్‌, రికార్డు అసిస్టెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌లుగా పోస్టింగులు ఇచ్చారు. రెవెన్యూ శాఖలో పది, పదిహేను సంవత్సరాలు పనిచేసిన వీఆర్‌వోలు, వీఆర్‌ఏల సర్వీస్‌ అంతా జీరో అయ్యింది. పదోన్నతులకు కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది.

- జిల్లాలో 215 రెవెన్యూ గ్రామాలు..

ధరణితో రైతులు, వివిధ వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం దాని స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చింది. దీని ద్వారా తహసీల్దార్లు, ఆర్డీవోలు, రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్లకు సైతం కొన్ని అధికారాలను కట్టబెట్టారు. భూ రికార్డులను ఆన్‌లైన్‌లోనే గాకుండా మ్యాన్యువల్‌గా కూడా నమోదు చేయనున్నారు. రెవెన్యూ సమస్యలను క్షేత్రస్థాయిలో వేగంగా పరిశీలించేందుకు గాను గ్రామానికి ఒక పరిపాలనాధికారిని నియమించాలని నిర్ణయించింది. జిల్లాలో 215 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ఒక్కో అధికారిని నియమించనున్నారు. ఇందుకు మొదట పూర్వ వీఆర్‌వోలు, వీఆర్‌ఏలకు అవకాశం ఇచ్చింది. డిగ్రీ పూర్తి చేసిన వీఆర్‌వోలు, ఇంటర్‌ పూర్తి చేసి ఐదేళ్లు అనుభవం ఉన్న వీఆర్‌ఏలు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఆ మేరకు జిల్లాలో 110 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి వివరాలను జిల్లా అధికారులు సీసీఎల్‌ఏకు పంపించారు. భూభారతి చట్టం వచ్చే నెల 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నందున ఆ లోపు గ్రామ పాలనాధికారులను నియమించనున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే వారంలో స్ర్కీనింగ్‌ టెస్టు నిర్వహించి నియమించనున్నారు.

Updated Date - May 10 , 2025 | 12:42 AM