బాలల సంరక్షణకు ప్రతి ఒక్కరు కృషిచేయాలి
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:47 PM
బాలల సంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన ఆదేశించారు.
సిరిసిల్ల రూరల్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : బాలల సంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ మహేష్ బీ గీతేతో కలిసి ఆపరేషన్ స్మైల్, బాలల సంరక్షణ, బాలకార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరిపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో జనవరి 1నుంచి 31వ తేదీవరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం జరిగిన సమావేశంలో మర్రిపల్లి చందన మాట్లాడుతూ చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చేయించడం, పనుల్లో పెట్టుకోవడం నేరమని, అలాచేస్తే సంబంధిత యజమానులపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ మహేష్ బీగీతే మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, బాల కార్మికులపై ఫిర్యాదులు అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, బాలల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ అంజయ్య, ఎస్ఐలు, అధికారులు పాల్గొన్నారు.