Share News

భక్తజన సంద్రం.. రాజన్న ఆలయం

ABN , Publish Date - May 26 , 2025 | 12:49 AM

పేదల దేవుడు.. కోడెమొక్కుల దేవుడుగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న ఆలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది.

భక్తజన సంద్రం.. రాజన్న ఆలయం

వేములవాడ కల్చరల్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): పేదల దేవుడు.. కోడెమొక్కుల దేవుడుగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న ఆలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 60వేల మంది భక్తులు తరలివచ్చినట్లు ఆలయాధికారులు అంచనా వేశారు. శ్రీరాజరాజేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు ఉదయాన్నే ఆలయ ధర్మగుండంలో పవిత్రస్నానాలను ఆచరించి కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ఆయా క్యూలైన్‌ల ద్వారా ఆలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీపార్వతిపరమేశ్వరులను దర్శించుకున్నారు. రాజన్నకు ఎంతో ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలో పాల్గొని తిరిగి ప్రయాణమయ్యారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈవో వినోద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏఈవోలు, సూపరింటెండెంట్‌లు, పీఆర్వో ఏర్పాట్లను పర్యవేక్షించారు. మాస శివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయ అర్చకులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, సాయంత్రం ఆలయ అద్దాల మండపంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంతే కాకుండా ముస్తాబాద్‌ మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన కోమటిరెడ్డి రాజిరెడ్డి సరిత దంపతులు రాజన్న నిత్యాన్నదాన సత్రానికి లక్ష రూపాయలు విరాళంగా ఏఈవో శ్రావణ్‌కుమార్‌కు చెక్కును అందజేశారు.

రాజన్న సేవలో సినీ డైరేక్టర్‌..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని తెలుగు సినీ డైరేక్టర్‌, ప్రొడ్యూసర్‌ ముద్దం నరేష్‌వర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి రాజన్న ప్రసాదాన్ని అందజేశారు.

Updated Date - May 26 , 2025 | 12:49 AM