రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Jun 08 , 2025 | 12:32 AM
వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
వేములవాడ కల్చరల్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాజన్న ఆలయానికి శనివారం 60 వేల మందికి పైగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఉదయాన్నే భక్తులు ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ధర్మదర్శనం, శీఘ్రదర్శనం, కోడెమొక్కు క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి ప్రవేశించి పార్వతిరాజరాజేశ్వర స్వామివారలను దర్శించుకున్నారు. అనంతరం పరివార దేవతాలయాలైన సీతారామచంద్రస్వామి, అనంతపద్మనాభస్వామి, సోమేశ్వర స్వామి, బాలత్రిపుర సుందరీదేవి ఆలయాల్లో కుంకుమ పూజలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు శివకల్యాణ పూజలో పాల్గొని తరించారు. రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని సినీ ఇండస్ర్టీ డీవోపీ ప్రయాంక వర్మ, భూపతిరాజులు దర్శించుకున్నారు. అర్చకులు వారిని ఆశీర్వదించి రాజన్న ప్రసాదం అందించారు.