అంబేద్కర్ను అడుగడుగునా అవమానించిన పార్టీ కాంగ్రెస్
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:45 PM
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ విమర్శించారు.
భగత్నగర్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ విమర్శించారు. సోమవారం నగరంలోని శుభమంగళ గార్డెన్లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తు ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న ఏకైన పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. అంబేద్కర్ అందరికీ దేవుడిలాంటి వారని, ఆయనను దళితులకే పరిమితం చేయడం సరికాదన్నారు. అంబేద్కర్ను దళిత జాతికే పరిమితం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు. ఆయన జీవితం నేటి తరానికి స్పూర్తి దాయకమన్నారు. అవమానాలను అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని చేరిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. భారత రత్న ఇవ్వకుండా ఆయనను ఎన్నికల్లో ఓడించిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ అన్నారు. అంబేద్కర్ చరిత్రను కనుమరుగు చేసేందుకు కుట్రలు చేశాన్నారు. అంబేద్కర్ చరిత్రను ప్రజలకు తెలియజేసేందుకు సామాజిక సమరత దినోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లను ప్రతిపాదిస్తే రిజర్వేషన్లు సరికాదని నెహ్రూ అన్నాడన్నారు. విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే మండల్ కమిషన్ సిఫారసులను ఆమోదించకుండా బీసీలను అవమానించిందన్నారు. ఆర్టికల్ 370 దేశానికి మంచిదికాదని, ఒకే దేశానికి రెండు చట్టాలు కరెక్ట్ కాదని అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకిస్తే ఆయనను అవమానిస్తూ ఆ ఆర్టికల్ను కాంగ్రెస్ ఆమోదించిదన్నారు. హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడితే అడ్డు తగిలి అవమానించిందన్నారు. కాంగ్రెస్ తీరును వ్యతిరేకించి రాజీనామా చేసి బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యునిస్టులతో కలిసి రెండు సార్లు అంబేద్కర్ను ఓడించిందన్నారు. డూప్లికేట్ గాంధీ కుటుంబ సభ్యులైన నెహ్రూ, ఇందిరా, రాజీవ్గాంఽధీలకు భారతరత్న ఇచ్చుకుందన్నారు. అంబేద్కర్కు ఇవ్వకుండా ఆయనను ఎన్నికల్లో ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేసిందన్నారు. దళితుడిగా పుట్టడమే పాపమైందనే భాధతో బౌద్ధమతాన్ని స్వీకరించేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. రిజర్వేషన్లు మన సమాజాన్ని అస్తవ్యస్తం చేస్తాయని చెప్పడమే కాకుండా లోక్ సభలో ఈ రిజర్వేషన్లను రాజీవ్గాంఽధీ తిరస్కరించారన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించేందకు కుట్రలు చేసిందన్నారు. మైనార్టీల సంతృప్తి పరిచేందుకు మైనార్టీ విద్యా సంస్థలకు అనేక మినహాయింపులిచ్చిందన్నారు. బీజేపీ పాలనలో అంబేద్కర్కు భారత రత్న అవార్డు అందించామన్నారు. అంబేద్కర్ జయంతిని రాష్ట్రీయ సమరసత దినంగా ప్రకటించి 120 దేశాల్లో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. పంచ తీర్థాలను అభివృద్ధి చేశామన్నారు. సుప్రీం కోర్టు న్యాయ మంత్రిత్వ శాఖలో విగ్రహం ఏర్పాటు చేశామని తెలిపారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించామన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు నారీ శక్తి వందన్ బిల్లును ప్రవేశపెట్టామన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేశామన్నారు. ఎన్సీబీసీ (జాతీయ బీసీ కమిషన్)కి రాజ్యాంగ బద్ధత కల్పించామన్నారు. దళిత, ఆదివాసీలను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదే అన్నారు. 12 మంది దళితులకు, 27 మంది ఓబీసీలకు, ఎనిమిది మంది మహిళలకు కేబినెట్లో చోటు కల్పించామన్నారు. ఏటా 1.25 లక్షల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్రావు, మానేరు అనంతరెడ్డి, దేవేందర్రావు, అడవి కుమార్, డాక్టర్ గంగాధర్, రాజేందర్రెడ్డి, సోమిడి వేణు పాల్గొన్నారు.